ఈ సైనిక శిబిరాలు స్మార్ట్‌

19 Nov, 2020 04:45 IST|Sakshi
తూర్పు లద్దాఖ్‌లో సైనిక శిబిరం

హీటెడ్‌ టెంట్లు, హీటర్లు, బెడ్లు..

లద్దాఖ్‌లో సైనికులకు ఆధునిక సదుపాయాలు

న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లద్దాఖ్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సైనికులు సమర్థంగా పనిచేయడానికి వీలుగా అత్యంత ఆధునిక వసతి సౌకర్యాలను కల్పించారు. కొద్ది రోజులుగా చైనాతో ఉద్రిక్తతలు నెలకొని ఉండడంతో శీతాకాలంలో సైనికుల ఆరోగ్యానికి పూర్తిగా రక్షణ కల్పించేలా స్మార్ట్‌ శిబిరాలను ఏర్పాటు చేశారు. నవంబర్‌ నుంచి ఈ ప్రాంతంలో రక్తం గడ్డకట్టే చలి మొదలవుతుంది. ఉష్ణోగ్రతలు దాదాపు మైనస్‌ 40 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోతాయి. 40 అడుగుల ఎత్తున మంచు పేరుకుపోతుంది. ఇలాంటి కఠినమైన వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుంటూ దేశ రక్షణ కోసం కంటి మీద రెప్ప వేయకుండా కాపలా కాసే మన జవాన్ల కోసం నిర్మించిన ఈ స్మార్ట్‌ క్యాంపుల్లో అన్ని రకాల సదుపాయాలున్నాయి.

చలిని తట్టుకోవడానికి శిబిరాల్లో హీటర్లు, 24 గంటలు వేడి నీళ్ల సదుపాయం, విద్యుత్, బెడ్లు, కబోర్డులు ఇలా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. ‘లద్దాఖ్‌లో గస్తీ ఉండే సైనికులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాం. వారు చలిని తట్టుకునేలా స్మార్ట్‌ శిబిరాల నిర్మాణం పూర్తయింది. దేశ రక్షణ కోసం పాటు పడే జవాన్లు శీతాకాలంలో సమర్థమంతంగా విధులు నిర్వహించడం కోసం మెరుగైన వసతి సదుపాయాలు కల్పించాం’అని భారత సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. స్మార్ట్‌ శిబిరాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ట్విట్టర్‌లో షేర్‌ చేయడంతో అవి విస్తృతప్రచారం పొందాయి. గత నెలలోనే చైనా కూడా ఈ ప్రాంతంలో ఆధునిక సదుపాయాలతో సైనిక శిబిరాలు ఏర్పాటు చేసి, వాటి వీడియోల్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. చైనా శిబిరాలకు ఏమాత్రం తీసిపోకుండా భారత్‌కి చెందిన స్మార్ట్‌ శిబిరాలు కూడా ఉండడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు