స్మార్ట్‌ రేసులో భారత నగరాల వెనుకంజ

18 Sep, 2020 05:07 IST|Sakshi

జాబితాలో టాప్‌లో సింగపూర్‌

న్యూఢిల్లీ: ప్రపంచ స్మార్ట్‌ సిటీల జాబితాలో భారతదేశంలోని ప్రధాన నగరాలు కాస్త వెనుకంజ వేశాయి. ఈ జాబితాలో సింగపూర్‌ టాప్‌లో నిలిచింది. ఐఎండీ, ఎస్‌యూటీడీలు సర్వే చేసి 2020 స్మార్ట్‌ సిటీ సూచీని తయారు చేశాయి. ఈ జాబితాలో గతేడాదితో పోలిస్తే భారతీయ నగరాల ర్యాంకులు దిగజారాయి. జాబితాలో హైదరాబాద్‌ 85, న్యూఢిల్లీ 86, ముంబై 93, బెంగళూరు 95వ స్థానాల్లో నిలిచాయి. 2019లో ఈ నగరాలు వరుసగా 67, 68, 78, 79 స్థానాలు దక్కించుకున్నాయి. కరోనా సంక్షోభానికి తయారుగా లేకపోవడంతో దేశీయ నగరాలు ఇబ్బంది పడ్డాయని సర్వే తెలిపింది.

సాంకేతికత నిత్యనూతనంగా(అప్‌ టు డేట్‌) లేని చోట కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపింది. భారతీయ నగరాలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య వాయు కాలుష్యమని ఇక్కడ నివసించేవారు అభిప్రాయపడ్డారు. వాయు కాలుష్యం తర్వాత హైదరాబాద్, ఢిల్లీలో కనీస సౌకర్యాలు లేకపోవడం, ముంబై, బెంగళూరుల్లో ఇరుకు రోడ్లు ప్రధాన సమస్యలుగా నిలిచాయి. అంతర్జాతీయంగా చూస్తే జాబితాలో సింగపూర్‌ తర్వాత హెల్సిన్కి, జ్యూరిచ్, ఆక్‌లాండ్, ఓస్లో, కోపెన్‌హాగెన్, జెనీవా, తైపీ, ఆమ్‌స్టర్‌డామ్, న్యూయార్క్‌లు ఉన్నాయి. జాబితా రూపొందించడం కోసం ప్రతి నగరంలో వందలాదిమందిని సర్వే చేశారు. సర్వే కోసం 15 సూచికలను వాడారు. కీలకంగా ఆరోగ్యం, భద్రత, రవాణా, అవకాశాలు, పాలన తదితర అంశాల్లో సాంకేతికత వినియోగంపై సర్వేలో ఎక్కువ దృష్టి పెట్టారు. స్మార్ట్‌సిటీలపై కరోనా ప్రభావం తీసివేయలేనిదని, సాంకేతికత బాగా ఉన్న చోట్ల ప్రభావం తక్కువని ఐఎండీ ప్రొఫెసర్‌ అర్టురోబ్రిస్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు