CDS Post: కేంద్రం కీలక నిర్ణయం.. రూల్స్‌ ఛేంజ్‌.. ఇకపై వాళ్లకు ఛాన్స్‌

7 Jun, 2022 18:54 IST|Sakshi

సీడీఎస్ నియామకం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ సైనికాధికారులకూ అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది.  

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ గతేడాది డిసెంబరు 8న హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. అప్పటినుంచి సీడీఎస్ గా ఇంకా ఎవరినీ నియమించలేదు. అయితే, సీడీఎస్ నియామకం కోసం కసరత్తులు చేస్తున్న కేంద్రం అర్హత ప్రమాణాలను కాస్త సడలించాలని నిర్ణయించుకుంది. 

సీడీఎస్ పదవి కోసం... రిటైరైన సైనికాధికారులు కూడా పరిగణనలోకి వస్తారని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు మూడు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇకపై ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు చెందిన రిటైర్డ్ చీఫ్ లు కూడా సీడీఎస్ అయ్యే వెసులుబాటు కలిగింది. 

ప్రస్తుతం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ దళాలకు అధిపతులుగా వ్యవహరిస్తున్న వారు, సర్వీసులో ఉన్న త్రీస్టార్ ఆఫీసర్లు, చీఫ్ గా వ్యవహరించి పదవీ విరమణ చేసిన 62 ఏళ్ల లోపు వయసున్న వారు, 62 ఏళ్ల లోపు వయసున్న రిటైర్డ్ త్రీస్టార్ ఆఫీసర్లు... సీడీఎస్ పదవి కోసం అర్హులవుతారని కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లో... రిటైర్డ్ అయిన అధికారులను కూడా పరిశీలనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.

చదవండి: 22,850 అడుగుల ఎత్తులో..

మరిన్ని వార్తలు