ఎయిరిండియాకు... త్వరలోనే ఫైనాన్షియల్‌ బిడ్లు!

27 Mar, 2021 09:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎయిరిండియాలో ప్రభుత్వ వాటాల ఉపసంహరణకు సంబంధించిన నూతన కాల వ్యవధిని పరిశీలిస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి తెలిపారు. రానున్న రోజుల్లో ఎయిరిండియాలో ప్రభుత్వ వాటాల విక్రయానికి ఆర్థిక బిడ్లకు ఆహ్వానం పలకనున్నట్టు చెప్పారు. బిడ్డర్లు పరిశీలించేందుకు వీలుగా డేటా రూమ్‌ను అందుబాటులో ఉంచామని.. ఆర్థిక బిడ్లకు 64 రోజల వ్యవధి ఉందని చెప్పారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకుని ఎయిరిండియాను ప్రైవేటు సంస్థకు అప్పగించడమేనన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పురి ఈ అంశంపై మాట్లాడారు.

కాగా, తీవ్ర నష్టాల్లో ఉన్న ఎయిరిండియాలో నూరు శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎయిర్‌ఇండియాను ప్రైవేటీకరించడం లేదంటే మూసివేయడం మినహా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపే అవకాశం లేదన్నారు.

అజయ్‌సింగ్‌ దూకుడు...
 స్పైస్‌జెట్‌ ప్రమోటర్‌ అయిన అజయ్‌సింగ్‌ ఎలాగైనా ఎయిరిండియాను సొంతం చేసుకోవాలన్న సంకల్పంతో ఉన్నట్టున్నారు. ఎయిరిండియా లో నూరు శాతం వాటాను సొంతం చేసుకునేందుకు రస్‌అల్‌ఖైమా ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీతోపాటు ఢిల్లీకి చెందిన బర్డ్‌ గ్రూపు ప్రమోటర్‌ అంకుర్‌ భాటియాతో జతకట్టారు. సింగ్, భాటియా ఇరువురూ తమ వ్యక్తిగత హోదాలో ఎయిరిండియా కోసం బిడ్లు దాఖలు చేశారని సంబంధిత ఉన్న వర్గాలు వెల్లడించాయి. మరోవైపు టాటా గ్రూపు సైతం ఎయిరిండియా కోసం పోటీపడుతోంది.

చదవండి: రూ.999 కే విమాన టికెట్‌: ఏయే రూట్లలో?

మరిన్ని వార్తలు