న్యూఢిల్లీ: డ్రోన్లు సులభంగా లభ్యమవుతుండడం తో భద్రతపరమైన సవాళ్లు మరింత పెరుగుతున్నాయని ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణె పేర్కొన్నారు. దాడులను డ్రోన్లు సులభతరం చేశాయన్నారు.ఆధునిక యుద్ధ రీతులను, డ్రోన్ దాడుల వంటి కొత్తరకం సవాళ్లను ఎదుర్కొనేందుకు కాలం చెల్లిన ఆలోచన విధానం సరికాదన్నారు. రక్షణ వ్యవస్థలను సమకూర్చుకునే విషయంలో ఆర్మీ డిజిటల్ కాలానికి మారకపోవడం సమస్యగా మారిందన్నారు. మార్పుకు అనుగుణంగా ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ఇప్పుడు అత్యంత ముఖ్యమన్నారు. జమ్మూ విమానాశ్రయంలోని వైమానిక దళ కేంద్రంపై ఇటీవల డ్రోన్ దాడులు జరిగిన నేపథ్యంలో జనరల్ నరవణె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ దాడులు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే చేసి ఉంటారని భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి.