క్షిపణి ప్రయోగం విజయవంతం

31 Oct, 2020 08:21 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళం శుక్రవారం చేసిన మరో క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. తూర్పు నౌకాదళ పరిధిలో బంగాళాఖాతంలో క్షిపణి సామర్ధ్య యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ కోరా నుంచి ప్రయోగించిన నౌకా విధ్వంసక క్షిపణి విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. ‘ఇది గరిష్ట దూరంలోని తన లక్ష్యాన్ని సమర్ధవంతంగా ఛేదించింది. క్షిపణి ఢీకొట్టడంతో నౌక ధ్వంసమైంది. క్షిపణి ప్రయోగం విజయవంతం అయింది..’ అని ప్రయోగం అనంతరం భారత నౌకాదళం ట్వీట్‌ చేసింది. ఈ క్షిపణి ప్రయోగానికి సంబంధించిన ఫొటోలు, వీడియోని నేవీ వర్గాలు విడుదల చేశాయి. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ వరుసగా క్షిపణి ప్రయోగాలు చేస్తోంది. (చదవండి: అందుకే ఆర్మీ చీఫ్‌కు చెమటలు పట్టాయి: ధనోవా)

ఇటీవల అరేబియా సముద్రంలో ఐఎన్‌ఎస్‌ ప్రబల్‌ యుద్ధనౌక నుంచి ప్రయోగించిన యాంటీ షిప్‌ మిస్సైల్‌ ప్రయోగం విజయవంతమైంది. ఒడిశా తీరంలో వీలర్‌ ఐలాండ్‌లో ఏపీజే అబ్దుల్‌ కలాం లాంచ్‌ కాంప్లెక్స్‌ నుంచి హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీ డెమానిస్ట్రేషన్‌ వెహికల్‌ని ప్రయోగించింది. బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి, న్యూక్లియర్‌ పవర్‌ కలిగిన శౌర్య సూపర్‌ సోనిక్‌ మిస్సైల్, మిస్సైల్‌ సహాయక టార్పెడో.. మొదలైన ప్రయోగాలు కూడా విజయవంతం కావడంతో నౌకాదళవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అత్యంత సమర్థమైన మిసైల్స్‌ని దేశీయంగా తయారు చేయడంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు