సరికొత్త రికార్డు సృష్టించిన భారత రైల్వే శాఖ

2 Jun, 2021 17:57 IST|Sakshi

కరోనా మహమ్మరి కాలంలో భారతీయ రైల్వే మరో రికార్డు సృష్టించింది. మే నెల మొత్తంలో అత్యధికంగా సరుకుల రవాణా చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. 2021 మేలో భారత రైల్వే అత్యధికంగా 114.8 మెట్రిక్ టన్నుల(ఎమ్‌టి) సరుకులను రవాణా చేసినట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇందులో సుమారు 54.52 మిలియన్ టన్నుల బొగ్గు, 15.12 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం, 5.36 మిలియన్ టన్నుల సిమెంట్(క్లింకర్ మినహా), 3.68 మిలియన్ టన్నుల ఎరువులు, 3.18 మిలియన్ టన్నుల మినరల్ ఆయిల్ రవాణా చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఫలితంగా గత నెలలో 11,604 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 

మే 2019లో 104.6 టన్నుల సరుకు రవాణా చేసింది. ఇప్పటి వరకు అదే అత్యధికం ఉండేది, ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది. 2019 మేతో పోలిస్తే ఇది 9.7 శాతం అధికమని అధికారులు వెల్లడించారు. భారతీయ రైల్వేకు గత నెలలో ఆదాయం, సరుకు రవాణా ఎక్కువగా ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. మే నెలలో వేగన్ టర్న్ అరౌండ్ టైమ్ 26 శాతం మెరుగైందని రైల్వే పేర్కొంది. గత 18 నెలల్లో సరుకు రవాణా రైళ్ల వేగం రెట్టింపు కావడంతో పాటు, రాయితీలు డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల గత నెలలో అత్యధికంగా సరుకు రవాణా చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. మే 2021లో సరుకు రవాణా రైళ్ల సగటు వేగం 45.6 కిలోమీటర్లుగా నమోదైంది, అదే సమయంలో ఇది గత ఏడాది 36.19 కిలోమీటర్ల వేగంతో పోలిస్తే 26 శాతం ఎక్కువ" అని రైల్వే శాఖ వెల్లడించింది.

చదవండి: మూడు నెలల్లో రూ.404 కోట్ల విలువైన బంగారం వేలం

మరిన్ని వార్తలు