చెప్తే వినలా.. 7000 మంది పురుషులను అరెస్టు చేసిన రైల్వే పోలీసులు

2 Jun, 2022 18:38 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే శాఖ మహిళల భద్రతను సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో రైళ్ల‌లోని మ‌హిళలకు కేటాయించిన కోచ్‌లలో ప్ర‌యాణిస్తున్న 7 వేల మంది పురుషుల‌ను అరెస్టు చేసింది రైల్వే ప్రొటెక్ష‌న్ ఫోర్స్ పోలీసులు. దీంతో పాటు మానవ అక్రమ రవాణా నుంచి 150 మంది అమ్మాయిల‌ను కూడా పోలీసులు ర‌క్షించారు. వివరాల్లోకి వెళితే.. మే 3 నుంచి మే 31 మధ్య  రైల్వే ప్రొటెక్ష‌న్ ఫోర్స్ పోలీసులు "ఆపరేషన్ మహిళా సురక్ష" కింద ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు.

రైళ్లలో ప్రయాణించే మహిళా ప్రయాణీకులకు మెరుగైన వసతులు, వారి భద్రతే ప్రధాన లక్ష్యంగా ఈ డ్రైవ్‌ నిర్వహణ జరిగింది. కాగా ఇందులో 283 పోలీసు బృందాలు మొత్తం 223 స్టేష‌న్ల‌ను కవర్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. రోజుకు 1,125 మంది మ‌హిళా ఆర్పీఎఫ్ పోలీసులు ఈ డ్రైవ్‌లో పాల్గొన్నట్లు చెప్పారు. వీటితో పాటు రైల్లో ప్రయాణిస్తున్న 2.25 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల‌తో మాట్లాడి, వారి భ‌ద్ర‌త‌కు తీసుకోవాల్సిన అంశాల‌పై స‌ల‌హాలు, సూచ‌న‌లు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. ఈ నెల రోజుల ఆపరేషన్‌లో, ఆర్‌పీఎఫ్ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి.. కదులుతున్న రైళ్లను ఎక్కేటప్పుడు, డీ బోర్డింగ్ చేస్తున్నప్పుడు జారిపడిపోతున్న ఘటనల్లోని 10 మంది మహిళల ప్రాణాలను కాపాడారని రైల్వే పోలీసులు తెలిపారు.

చదవండి: ఈ ఏడాది చివర్లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు, కాంగ్రెస్‌కు హార్దిక్‌ షాక్‌

మరిన్ని వార్తలు