క్వీన్‌ ఎలిజబెత్‌–2 మృతి.. కెమిల్లా ధరించనున్న కిరీటంలో కోహినూర్‌... అప్పగించాలని డిమాండ్లు

10 Sep, 2022 11:57 IST|Sakshi

న్యూఢిల్లీ: క్వీన్‌ ఎలిజబెత్‌–2 మరణంతో కోహినూర్‌ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. 105 క్యారెట్ల అత్యంత విలువైన ఈ వజ్రాన్ని వెనక్కి ఇచ్చేయాలంటూ భారత్‌లో పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. కోహినూర్‌ను ఇకనైనా స్వదేశానికి అప్పగించాలంటూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కోహినూర్‌ అంటే వెలుగుల కొండ అని అర్థం. 14 శతాబ్దం ఆరంభంలో దక్షిణ భారతదేశంలో తవ్వకాల్లో లభించినట్లు చరిత్రలో నమోదయ్యింది. తర్వాత పలువురు రాజులు, చక్రవర్తుల చేతులు మారుతూ వచ్చింది.

చివరకు బ్రిటిష్‌ రాణి కిరీటంలోకి చేరింది. కోహినూర్‌ తమదేనంటూ భారత్, పాకిస్తాన్, ఇరాన్, అఫ్గానిస్తాన్‌ దేశాలు వాదిస్తున్నాయి. వజ్రానికి అసలు హక్కుదారులు ఎవరన్నదానిపై శతాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు బ్రిటన్‌ రాణి మృతిచెందారంటూ కాబట్టి కోహినూర్‌ను భారత్‌కు అప్పగించాలని ట్విట్టర్‌లో జనం డిమాండ్‌ చేస్తున్నారు. బ్రిటన్‌ నూతన రాజుగా చార్లెస్‌ సింహాసనాన్ని అధిష్టించబోతున్నారు. కోహినూర్‌ వజ్రం పొదిగిన కిరీటాన్ని రాణి హోదాలో ఆయన భార్య కెమిల్లా పార్కర్‌ ధరిస్తారు. కోహినూర్‌ వెనక్కి రప్పించడానికి ప్రయత్నిస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది.

మరిన్ని వార్తలు