Ukraini Russia War: జై హింద్‌.. జై భారత్.. ప్లీజ్‌ హెల్ప్‌

28 Feb, 2022 19:21 IST|Sakshi

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న యూపీ విద్యార్థిని వేడుకోలు

వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసిన ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో వేలాది మంది భారతీయ విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయారు. తమను కాపాడమంటూ సోషల్‌ మీడియా వేదికగా వేడుకుంటున్నారు. సహాయం చేయాలంటూ ఓ విద్యార్థిని వేడకుంటున్న వీడియోను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ట్విటర్‌లో షేర్‌ చేశారు. భారత విద్యార్థులను సురక్షితంగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

దయచేసి తమను రక్షించాలని ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన గరిమా మిశ్రా అనే యువతి వీడియోలో వేడుకున్నారు. ఉక్రెయిన్‌లో ఏం జరుగుతుందో తమకు తెలియడం లేదని వాపోయింది. అనుక్షణం బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నామని కన్నీటి పర్యంతమైంది. తమకు ఎవరూ సహాయం చేయడం లేదని, రాయబార కార్యాలయానికి ఫోన్‌ చేసినా స్పందన లేదని వాపోయింది. 

‘సరిహద్దుకు బస్సులో వెళ్లిన మా స్నేహితులను రష్యా సైనికులు అడ్డుకున్నారని మాతో చెప్పారు. విద్యార్థులపై కాల్పులు జరిపి బాలికలను ఎత్తుకెళ్లారు. అబ్బాయిలు ఏమయ్యారో మాకు తెలియదు. మాకు సాయం చేయడానికి భారత సైన్యాన్ని పంపిండి. దయచేసి మాకు సహాయం చెయ్యండి. జై హింద్! జై భారత్! మాకు సహాయం అందేలా చేసేందుకు ఈ వీడియోను దయచేసి షేర్‌ చేయండి’ అంటూ గరిమా మిశ్రా ముకుళిత హస్తాలతో వేడుకున్నారు. (క్లిక్‌: రష్యాతో చర్చల వేళ.. ఈయూ ఎదుట జెలెన్‌ స్కీ కీలక డిమాండ్‌)

కాగా, ప్రత్యేక విమానాల ద్వారా భారత విద్యార్థుల తరలింపు కొనసాగుతోంది. తాజాగా హంగరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి 240 మంది భారత పౌరులతో బయలుదేరిన విమానం సోమవారం ఢిల్లీ చేరుకుంది. కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ.. విమానాశ్రయంలో భారతీయులకు స్వాగతం పలికారు. (క్లిక్‌: ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌పై సమంత పోస్టు.. ఏమందంటే?)

మరిన్ని వార్తలు