IndiGo: ప్రయాణికుల భద్రత విషయంలో ఇండిగో నిర్వహణ బాగోలేదు.. ఉద్యోగుల షాకింగ్‌ ఆరోపణలు

17 Jul, 2022 12:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రామాణిక నిర్వహణ విధానాలను ఇండిగో సరిగ్గా పాటించడం లేదని ఆ సంస్థలో పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు ఆరోపించారు. దీని వల్ల ప్రయాణికుల భద్రత రిస్క్‌లో పడుతోందని పేర్కొన్నారు. ఈమేరకు ఆల్ ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్స్ జులై 12న విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌కు లేఖ రాశారు. ఇండిగో విషయంలో వెంటనే జోక్యం చేసుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఎయిర్‌బస్‌కు వారు విజ్ఞప్తి చేశారు.

'మీరు విమానాలకు లీజుకు ఇచ్చిన ఆపరేటర్లు నిర్వహణ ప్రమాణాలను పాటించడం లేదు. గత నాలుగు రోజులుగా సాంకేతిక సిబ్బంది స్ట్రయిక్ చేస్తున్నారు. అయినా సరైన నిర్వహణ లేకుండానే విమానాలు నడుస్తున్నాయి.  మీరు ఈ విషయంలో జోక్యం చేసుకుని గత ఏడు రోజులకు సంబంధించిన నిర్వహణ డాటాను ఆపరేటర్లను అడగండి. సరైన నిర్వహణ లేకపోతే ఆ సంస్థల వల్ల మార్కెట్‌లో మీ కంపెనీకి కూడా చెడ్డపేరు వస్తుంది. మీ విమానాల నిర్వహణ ప్రమాణాలను వారు దిగజార్చారు. ఈ విషయంపై మీరు వాళ్లని నేరుగా ప్రశ్నించండి.' అని సాంకేతిక నిపుణులు ఎయిర్‌బస్‌కు లేఖ రాశారు.

అయితే, ఈ ఆరోపణలను ఇండిగో కొట్టిపారేసింది. విమాన నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నట్లు పేర్కొంది. అన్ని నిబంధనలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పింది. ఇవి నిరాధార ఆరోపణలని, కొందరు దురుద్దేశంతోనే ఈ ప్రచారం చేస్తున్నట్లు తెలిపింది.

అయితే, ఇండిగో సాంకేతిక నిపుణులు లేఖ రాసిన ఐదు రోజులకే ఆ సంస్థకు చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం గమనార్హం. ఆదివారం షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం సాంకేతిక కారణాలతో పాకిస్థాన్ కరాచీలో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. దీంతో ఈ లేఖ చర్చనీయాంశమైంది.
చదవండి: కరాచీ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

మరిన్ని వార్తలు