వ్యాక్సినేషన్ పరంగా రికార్డు సృష్టించిన ఇండోర్

22 Jun, 2021 15:43 IST|Sakshi

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లా జాతీయ స్థాయిలో వ్యాక్సినేషన్ పరంగా రికార్డు సృష్టించింది. కేవలం ఒకే ఒక్క రోజులో రెండు లక్షల మందికి పైగా కోవిడ్-19 వ్యాక్సిన్ వేసింది. దేశంలోని ఏ జిల్లాలో కూడా ఒకే రోజులో ఇంత భారీ మొత్తంలో వ్యాక్సినేషన్లు వేయలేదు. కేంద్రం జూన్ 21 నుంచి కోవిడ్-19 వ్యాక్సినేషన్ ఉచితంగా అన్నీ రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తొలి రోజే దేశం మొత్తం మీద ప్రజలకు 85.15 లక్షలకు పైగా టీకా డోసులిచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 

ఇండోర్ కలెక్టర్ మనీష్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్లో "వ్యాక్సిన్ మహాభియాన్" కింద సుమారు 2,21,663 మందికి టీకాలు వేశారు. దేశంలో ఇంత భారీ స్థాయిలో ఒకే జిల్లాలో వ్యాక్సినేషన్ వేసిన సందర్భాలు లేవు అని అన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం జిల్లా యంత్రాంగం పగటిపూట రెండు లక్షల మందికి టీకాలు వేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. "నాలుగు రోజుల క్రితం, రెండు లక్షల మందికి టీకాలు వేయాలనే లక్ష్యాన్ని మాకు ఇచ్చారు. ఈ ప్రక్రియ కోసం ఆరోగ్య విభాగాలు, మునిసిపల్ కార్పొరేషన్లు, జిల్లా పరిపాలన, ప్రైవేట్ ఆసుపత్రులు, హోటల్ సంఘాలు బృందాలుగా విడిపోయాం" అని సింగ్ చెప్పారు. "మొత్తం ఎన్నికల ప్రక్రియ మాదిరిగానే జరిగింది. ఆదివారం రాత్రినే వ్యాక్సిన్ పంపిణీ కోసం జిల్లాలో 40 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు" అని ఆయన తెలిపారు.

చదవండి: రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న పెట్రోల్ ధరలు

మరిన్ని వార్తలు