వీధి కుక్క దాడిలో పసికందు మృతి.. పేగులు బయటకు తీయటంతో..!

18 Oct, 2022 10:43 IST|Sakshi

నోయిడా: తల్లిదండ్రులు భవన నిర్మాణంలో కూలీ పనులు చేసుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వారి ఏడు నెలల పసికందుపై ఓ వీధి కుక్క దాడి చేసింది. పేగులు బయటకు తీయటంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ నోయిడాలోని హౌసింగ్‌ సొసైటీ లోటస్‌ బౌలేవార్డ్‌ సెక్టార్‌ 100లో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సంఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి శునకాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హౌసింగ్‌ సొసైటీలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కూలీ పని చేసుకునే ఓ కుటుంబం తమ 7 నెలల పాపతో అక్కడే ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం వీధి కుక్క దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన శిశువును నోయిడాలోని యదార్థ ఆసుపత్రి ఐసీయూలో చేర్చారు. పసికందు పేగులు బయటకు రావటం వల్ల వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయనా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం ఉదయం చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వీధి కుక్కలు దాడి చేయటం ఇదేం మొదటి సారి కాదని, ప్రతి 3-4 నెలలకోసారి దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులు. నోయిడా అథారిటీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదన్నారు. 

నోయిడా హౌసింగ్‌ సొసైటీ ముందు స్థానికుల ఆందోళన

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు.. ఈ విషయంపై ఏఓఏ స్పందించారు. నోయిడా అథారిటీతో మాట్లాడామని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపడుతుందని తెలిపారు.

ఇదీ చదవండి:  చీకటి గదిలో బంధించి, బలవంతంగా పెళ్లి

మరిన్ని వార్తలు