ఉరి వేసుకొని చనిపోయిన జాతీయ స్విమ్మర్‌

13 Apr, 2021 20:25 IST|Sakshi

యశవంతపుర: కరోనా కాటుతో ఏడాదికి పైగా ఉద్యోగం లేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన క్రీడాకారిణి, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదం బెంగళూరులో వెలుగుచూసింది. జాతీయ స్థాయి క్రీడాకారణి జి.బి.శిల్ప బాలరాజు (41) స్విమ్మింగ్‌లో ఉత్తమ ప్రతిభ చూపినందుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏకలవ్య అవార్డు పొందారు. శిల్ప బెంగళూరు జయనగరలో నివాసముంటూ ఒక ప్రైవేట్‌ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. కరోనా కారణంగా స్కూల్‌లో ఆమెతో సహా పలువురు టీచర్లను తొలగించారు. 

పనిలోకి చేర్చుకోవాలని శిల్ప పలుమార్లు పాఠశాల యజమాన్యానికి లేఖ రాసినా వారు పట్టించుకోలేదు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిటికీకి తాడుతో ఉరి వేసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి చేరుకున్న భర్త, నృత్య శిక్షకునిగా పనిచేసే నీలకృష్ణ ప్రసాద్‌ విగతజీవిగా మారిన శిల్ప కనిపించారు. క్రీడాకారిణిగా జాతీయ స్థాయికి ఎదిగినప్పటికీ పాఠశాలలో ఒక ఉద్యోగం సంపాదించలేక పోయానని సూసైడ్‌ నోట్‌లో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం శిల్ప తల్లి మరణించారు. ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌ శిల్ప ఆత్మహత్య సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది.

చదవండి: 

క్షుద్రపూజలు చేసిన కుటుంబానికి దేహశుద్ధి

మరిన్ని వార్తలు