ఐపీఎస్‌ రూపా మౌద్గిల్‌ను కట్టడి చేయండి

23 Feb, 2023 05:33 IST|Sakshi

కోర్టును ఆశ్రయించిన రోహిణి సింధూరి

బెంగళూరు: కర్ణాటకలో ఐపీఎస్‌ అధికారి రూపా మౌద్గిల్, ఐఏఎస్‌ అధికారి రోహిణి సింధూరి మధ్య సమరం కొనసాగుతోంది. సోషల్‌ మీడియాలో పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకోవడంతో వారిని ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇద్దిరికీ పోస్టింగ్‌ కూడా ఇవ్వలేదు. తన గురించి తప్పుడు ప్రచారం చేయకుండా, సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టకుండా నిషేధం విధించాలని కోరుతూ రోహిణి సింధూరి బెంగళూరులోని సిటీ సివిల్, సెషన్స్‌ కోర్టును ఆశ్రయించారు.

ఆమె తన పిటిషన్‌లో రూపా మౌద్గిల్‌తోపాటు 60 మంది పేర్లను ప్రస్తావించారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది. రూపా మౌద్గిల్‌ను, సోషల్‌ మీడియాను కట్టడి చేసేలా ఇంజక్షన్‌ ఆర్డర్‌ జారీ చేయాలని రోహిణి తరపు న్యాయవాది కోరారు. సర్వీసు రూల్స్‌ ప్రకారం రోహిణి ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారని, పోలీసులకు కూడా ఫిర్యాదు సమర్పించారని న్యాయస్థానం గుర్తుచేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.   

మరిన్ని వార్తలు