ఫారినర్‌లకు షాక్‌.. టాయిలెట్‌ ‘భారీ’ బిల్లుకు జీఎస్టీ!! ఐఆర్‌సీటీసీ ఏం చెప్పిందంటే..

3 Sep, 2022 21:13 IST|Sakshi

ఢిల్లీ: జీఎస్టీ.. దేశంలో ఇదొక హాట్‌ టాపిక్‌ అయిపోయింది. నిత్యావసరాల మొదలు.. చాలావాటిపై కేంద్రం జీఎస్టీ వడ్డన చేయడంతో.. సోషల్‌మీడియాలోనూ విపరీతమైన విమర్శలు వినిపించాయి. తాజాగా టాయిలెట్‌కు వెళ్లినా ఫారినర్లకు భారీ బిల్లుతో పాటు అందులో జీఎస్టీ సైతం పడడంతో కంగుతిన్నారు. దేశ రాజధానిలోనే ఈ ఘటన జరిగింది. 

ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్‌లో వాష్‌ రూమ్‌ని వాడుకున్నందుకు ఇద్దరు విదేశీ పర్యాటకులు భారీ బిల్లు ఫ్లస్‌ జీఎస్టీ చెల్లించాల్సి వచ్చింది. అయితే వారిని రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన గైడ్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.  బ్రిటిష్ ఎంబసీ నుంచి విదేశీయులిద్దరూ గతిమాన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్‌లో దిగారు.  వాళ్లను శ్రీవాస్తవ అనే గైడ్‌ రీసివ్ చేసుకున్నాడు.

అయితే.. స్టేషన్‌లో దిగిన వెంటనే ఫ్రెష్ అవ్వాలనుకున్నారు. దీంతో స్టేషన్‌లో ఉన్న ఎగ్జిక్యూటివ్‌ లాంజ్‌లోకి తీసుకెళ్లారు శ్రీవాస్తవ. కేవలం ఐదు నిమిషాల్లో వాళ్లు వాష్‌రూమ్‌‌ నుంచి బయటకు వచ్చారు. సాధారణంగా ఐదు, పది రూపాయలు.. మహా అయితే రూ. 20 ఇవ్వాల్సి వస్తుందని శ్రీవాస్తవ భావించారు. కానీ, అక్కడి రిసెప్షనిస్ట్.. రూ. 224 బిల్లు చేతిలో పెట్టడంతో.. ఆయన షాక్ అయ్యారు.

ఐదు నిమిషాల పాటు వాష్‌ రూం వాడుకున్నందుకు ఒక్కొక్క‌రి బిల్లు రూ. 100లు వేశారు. పైగా దానిపై జీఎస్టీ రూ. 12 జత చేశారు. అలా వారిద్ద‌రికీ క‌లిపి రూ. 224 బిల్లు అయింది. అంత చెల్లించేందుకు మొదట వాళ్లు ఒప్పుకోలేదు. కానీ, సిబ్బంది ఒత్తిడితో చివరికి చెల్లించాల్సి వచ్చింది. ఈ ఘటనపై ఐఆర్‌సీటీసీ ప్రతినిధి బ్రజేష్ కుమార్  ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లోకి ప్ర‌వేశానికి ప్ర‌త్యేక చార్జ్ ఉందని, దానిపై జీఎస్టీ ప‌డుతుంద‌ని చెప్పారు. అంతేకాదు లాంజ్‌లో ఉన్నంతసేపు టూరిస్టులు, ఫారినర్లు ఫ్రీగా వైఫై వాడుకోవచ్చని, కాంప్లిమెంటరీగా కాఫీ కూడా ఇస్తామని చెప్పుకొచ్చారు.

అయితే దీనిపై గైడ్ శ్రీవాస్తవ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జనరల్ కోచ్‌లో ఆగ్రా నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తే టికెట్‌ రూ. 90 రూపాయలు మాత్ర‌మేన‌ని, కానీ స్టేషన్‌లో వాష్‌రూం వినియోగించుకున్నందుకు రూ. 112 చార్జ్ చేస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతిథి దేవో భవ పిలుపును ఐఆర్‌సీటీసీ అవమానిస్తోందని, ఇలా చేయడం వల్ల విదేశీయులు ఇక్కడి వ్యవస్థలపై తప్పుడు అభిప్రాయం ఏర్పరుచుకునే ప్రమాదం ఉందని,  ఈ వ్యవహారంపై టూరిజం శాఖలో ఫిర్యాదు చేస్తానన్నారు.

ఇదీ చదవండి: గుండెల్ని పిండేస్తున్న వీడియో.. స్పందించిన గడ్కరీ కార్యాలయం

మరిన్ని వార్తలు