ISRO: జూన్‌లో చంద్రయాన్‌ 3

21 Oct, 2022 04:49 IST|Sakshi

ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్‌

న్యూఢిల్లీ: చందమామపై శోధనకు ఉద్దేశించిన చంద్రయాన్‌–3 ప్రయోగం వచ్చే ఏడాది జూన్‌లో ఉంటుందని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చైర్మన్‌ ఎస్‌.సోమ్‌నాథ్‌ ప్రకటించారు. గురువారం ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో సోమ్‌నాథ్‌ మాట్లాడారు. ‘ గగన్‌యాన్‌ ప్రాజెక్ట్‌ కోసం తొలి రోదసీనౌక పరీక్షను వచ్చే ఏడాది తొలినాళ్లలో చేపడతాం.

లాంచ్‌ వెహికల్‌ మార్క్‌–3 ద్వారా చంద్రయాన్‌–3ను ప్రయోగిస్తాం. పలుమార్లు మానవరహిత వాహకనౌక పరీక్షల తర్వాత 2024 చివరికల్లా భారతీయ వ్యోమగాములు విజయవంతంగా కక్ష్యలో అడుగుపెట్టేలా చేస్తాం. 2019 సెప్టెంబర్‌లో విక్రమ్‌ ల్యాండర్‌ను చంద్రుడిపై దింపేందుకు చేసిన చంద్రయాన్‌–2 ప్రయోగం విఫలమైంది.

ఈసారి అలా జరగబోదు. ఇది భిన్నమైన ఇంజనీరింగ్‌. ఉపరితలంపై ల్యాండర్‌ దిగేటపుడు పాడవకుండా ఉండేందుకు శక్తివంతమైన కాళ్లు సిద్ధంచేస్తున్నాం. ఈ ప్రక్రియలో ఏవైనా పొరపాట్లు జరిగితే, ప్రయోగం సజావుగా సాగేందుకు ‘మరో పరిష్కారం’ రంగంలోకి దిగుతుంది. ‘చంద్రుడిని చేరే క్రమంలో ఎంత ఎత్తులో ప్రయాణించాల్సి రావచ్చు? చంద్రుడి ఉపరితలంపై సమస్యలు లేని స్థలాల గుర్తింపు వంటి అంశాల్లో మరింత స్పష్టత సాధిస్తున్నాం’ అని అన్నారు.

మరిన్ని వార్తలు