‘ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ1 ప్రయోగం విఫలం’.. ఇస్రో అధికారిక ప్రకటన

7 Aug, 2022 16:38 IST|Sakshi

సూళ్లూరుపేట(తిరుపతి): ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1 ప్రయోగం విఫలమైందని అధికారికంగా ప్రకటించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఆ రాకెట్‌ మోసుకెళ్లిన రెండు ఉపగ్రహాలు ఇకపై పనికిరావని ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. మూడు దశలను విజయవంతంగా దాటిన రాకెట్‌.. టర్మినల్‌ దశలో అదుపు తప్పింది. రెండు ఉపగ్రహాలను 356x76 కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే.. ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ1 రాకెట్‌ వాటిని 356 కిలోమీటర్లు వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టింది.

అందువల్ల ఈ ఉపగ్రహాలు పనికి రావని ఇస్రో వెల్లడించింది. సెన్సార్‌ విఫలమవటం వల్లే ఈ సమస్య తలెత్తిందని పేర్కొంది. టర్మినల్‌ దశలో తలెత్తిన సాంకేతిక సమస్యపై ఇస్రో ఏర్పాటు చేసిన కమిటీ విశ్లేషిస్తోందని, ఈ కమటీ ఇచ్చే నివేదిక, ప్రతిపాదనల ఆధారంగా త్వరలోనే ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 ప్రయోగాన్ని చేపడతామని పేర్కొంది. 

ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహా వాహకనౌక ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1ను తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు ప్రయోగించారు. ఈ రాకెట్‌ ఈవోఎస్‌-02, ఆజాదీశాట్‌ ఉపగ్రహాలను మోసుకెళ్లింది. ఈవోఎస్‌-02 ఉపగ్రహం బరువు 140 కిలోలు. ఇది భూమిని పరిశీలిస్తుంది. ఆజాదీశాట్‌ బరువు 8 కిలోలు. 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థులు దీన్ని రూపొందించారు.  ఈ ప్రయోగంలో మూడు దశలు అనుకున్నట్లుగానే పూర్తయినట్లు ఇస్రో మొదట వెల్లడించింది. టెర్మినల్‌ దశకు సంబంధించిన సమాచారం రావడంలో కొంత జాప్యం జరిగినట్లు తెలిపింది.

మరిన్ని వార్తలు