21న భేటీ: ఫేస్‌బుక్‌, ట్విటర్‌కు కేంద్రం సమన్లు

18 Jan, 2021 08:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సోషల్‌ మీడియాలో ప్రధానంగా ఉన్న ఫేస్‌బుక్‌, ట్విటర్‌కు కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. దుర్వినియోగంపై సమన్లు జారీ చేసి ఈనెల 21వ తేదీన తమ ముందుకు హాజరుకావాలని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమన్లు పంపించింది. ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు అందించిన ఆధారాలతో పార్లమెంటరీ కమిటీ ప్రతినిధులు ఆ సంస్థల ప్రతినిధులతో చర్చించనున్నారు. సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేసిన అంశంపై మాట్లాడనున్నారు. డిజిటల్‌ రంగంలో పౌరుల హక్కుల రక్షణ, సోషల్‌ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో ప్రధానంగా మహిళల భద్రత విషయమై ఈ సమావేశం నిర్వహించనున్నారు.

ఇటీవల సోషల్‌ మీడియా సంస్థలపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఒక పార్టీకి.. కొందరు నాయకులకు మద్దతుగా సోషల్‌ మీడియా వ్యవహరిస్తోందని గుర్తించారు.దీనిపై కొన్ని నెలల కిందట పెద్ద వివాదమే నడిచిన విషయం తెలిసిందే. రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమైంది. మొత్తంగా సోషల్‌ మీడియా దుర్వినియోగంపై నియంత్రణ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఫేస్‌బుక్‌, ట్విటర్‌‌కు సమన్లు జారీ చేసింది. ఆ సంస్థల ప్రతినిధులతో 21వ తేదీన సమావేశమై కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం ఉంది. లేదా కొత్తగా నిబంధనలు విధించి వీటిని తప్పనిసరిగా అమలయ్యేలా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వాట్సాప్‌ వ్యక్తిగత వివరాల అప్డేట్‌పై రేగిన వివాదం నేపథ్యంలో ఈ భేటి ప్రాధాన్యం సంతరించుకుంది.
(చదవండి: నిన్న ట్రంప్‌.. నేడు గ్రేసీ)

మరిన్ని వార్తలు