తోటి సైనికులపై విచక్షణారహితంగా కాల్పులు.. ఆపై ఆత్మహత్య

16 Jul, 2022 19:51 IST|Sakshi

శ్రీనగర్‌: ఇంటో టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌(ఐటీబీపీ)కి చెందిన కానిస్టేబుల్‌ తన తోటి సైనికులపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. జమ్ముకశ్మీర్‌లోని ఉధమ్‌పుర్‌లో శనివారం మధ్యాహ్నం ఈ సంఘటన వెలుగుచూసింది. ముగ్గురు సహచరులపై కాల్పులు జరిపిన అనంతరం తానూ కాల్పుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కానిస్టేబుల్‌. 

ఉధంపుర్‌లోని దేవికా ఘాట్‌ కమ్యూనిటీ సెంటర్‌లో శనివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన కానిస్టేబుల్‌ 8వ బెటాలియన్‌ భూపేంద్ర సింగ్‌గా గుర్తించారు. 'జమ్ముకశ్మీర్‌లోని ఉధమ్‌ఫుర్‌లో ముగ్గురు జవాన్లపై ఐటీబీపీ 8వ బెటాలియన్‌ కానిస్టేబుల్‌ కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఆ తర్వాత తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తూటాలు తగిలిన ముగ్గురు జవాన్లను ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉంది.' అని ఉన్నతాధికారులు తెలిపారు. 

ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపింది ఐటీబీపీ. కాల్పులు జరిపేందుకు గల కారణాలు తెలియరాలేదని పేర్కొంది. మృతి చెందిన కానిస్టేబుల్‌ ఐటీబీపీలోని ఎఫ్‌ కంపెనీకి చెందినట్లు తెలిపింది.

ఇదీ చూడండి: విషాదం.. మజాక్‌ల చేసిన పనితో దోస్త్‌ ప్రాణం పోయింది

మరిన్ని వార్తలు