జైల్‌ టూరిజం.. !

26 Jan, 2021 14:28 IST|Sakshi

పూనా ఒప్పందం జరిగింది ఎప్పుడు జరిగింది? 1932లో. ఆ ఒప్పందం మీద సంతకం చేసింది ఎవరు? మహాత్మా గాంధీ– బాబా సాహెబ్‌ అంబేద్కర్‌. ఆ ఒప్పందం ఎక్కడ జరిగింది? ఇదీ ఇప్పుడు తెలుసుకోవాల్సిన సమాచారం. ఆ ఒప్పందం యరవాడ సెంట్రల్‌ జైల్‌లో జరిగింది. ఆ రోజున మహాత్మా గాంధీజీ– అంబేద్కర్‌ ఏ చెట్టు కింద అయితే కూర్చుని ఒప్పందం మీద సంతకం చేశారో... ఆ చెట్టు జైలు ప్రాంగణంలో ఇప్పటికీ ఉంది. అలాగే గాంధీజీ, లోకమాన్య బాలగంగాధర తిలక్‌ శిక్ష అనుభవించిన జైలు వార్డులు కూడా నాటి స్వాతంత్య్ర సమరానికి మౌన సాక్షులుగా నిలిచి ఉన్నాయి. పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ, మోతీ లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభ్‌ బాయ్‌ పటేల్‌ భరత మాత సంకెళ్లు తెంచే యజ్ఞంలో అరెస్టయి ఇదే జైల్‌లో శిక్షను అనుభవించారు. చాపేకర్‌ సోదరుల ఉరితీత ఇక్కడే.

అంతేకాదు.. 2008, ముంబయి అల్లర్లకు పాల్పడిన ఉగ్రవాది కసబ్‌ను ఉరి తీసింది కూడా ఇక్కడే. జైలు... అనగానే నేరగాళ్లు శిక్ష అనుభవించే ప్రదేశంగానే చూస్తున్నాం. నిజానికి యరవాడ జైలు దేశ చరిత్రను అవగతం చేసే ప్రాంగణం. అసలే... ఈ తరం విద్యార్థులకు చరిత్ర పాఠాలు పెద్దగా తలకెక్కడం లేదు. ఇక్కడ పర్యటిస్తే స్వాతంత్య్ర సమరం కళ్లకు కడుతుంది. అందుకే స్కూలు, కాలేజ్‌ విద్యార్థుల కోసం ‘జైలు పర్యటన’కు తలుపులు తెరిచింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 26వ తేదీ రిపబ్లిక్‌ డే సందర్భంగా జైల్‌ టూరిజాన్ని ప్రారంభించనుంది. రోజుకు యాభైమందిని మాత్రమే అనుమతిస్తారు. ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. జైలు పర్యటనకు వచ్చిన విద్యార్థులకు గైడ్‌లుగా జైలు సెక్యూరిటి గార్డులు వ్యవహరిస్తారు.(చదవండి: మీ భంగిమలను ఇలా చెక్‌ చేసుకోండి!)

మరిన్ని వార్తలు