ఎట్టకేలకు నెరవేరనున్న కశ్మీరీల కల.. తొలి మల్టీఫ్లెక్స్‌ త్వరలో..

10 Aug, 2022 18:55 IST|Sakshi

శ్రీనగర్‌: మిలిటెంట్‌ దాడులు, ఎన్‌కౌంటర్‌లు, భద్రతా దళాల పహారాతో ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది జమ్ము కశ్మీర్‌లో. అలాంటి చోట కశ్మీరీల చిరకాల కోరిక నెరవేరబోతోంది. దేశంలో మిగతా ప్రాంతాల్లోలాగే.. సరదాగా అయినవాళ్లతో సినిమాలు చూసే అవకాశం కలగబోతోంది అక్కడి ప్రజలకు. ఆ గడ్డపై మొట్టమొదటి మల్టీఫ్లెక్స్‌ త్వరలో ప్రారంభం కాబోతోంది. 

ఐనాక్స్‌ సంస్థ నిర్మించిన ఈ మల్టీఫ్లెక్స్‌.. సెప్టెంబర్‌లో ప్రేక్షకుల కోసం అందుబాటులోకి రానుంది. మూడు సినిమా హాల్స్‌తో ఐదువందల మంది సినిమా వీక్షించేలా ఏర్పాటు చేస్తోంది ఐనాక్స్‌. ఫుడ్‌ కోర్టుతో పాటు పిల్లల కోసం ప్లే స్టేషన్‌లను ఏర్పాటు చేస్తోంది. పైగా కశ్మీరీ కల్చర్‌ ప్రతిబింబించేలా లాబీలు, వుడెన్‌ వర్క్‌తో ప్రత్యేక ఏర్పాట్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు.

అల్లకల్లోల పరిస్థితుల నడుమ 90వ దశకంలో కశ్మీర్‌లో థియేటర్లు మూతపడ్డాయి. అయితే.. 1999లో తిరిగి వాటిని తెరచేందుకు ప్రయత్నాలు జరిగాయి. శ్రీనగర్‌లో నీలం, రెగల్‌, బ్రాడ్‌వేలు తెర్చుకున్నప్పటికీ.. మిలిటెంట్ల దాడులతో మళ్లీ అవి మూతపడ్డాయి. ఇన్నేళ్ల తర్వాత కశ్మీర్‌లో ఒక మల్టీఫ్లెక్స్‌ రాబోతుండడంపై అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మల్టీప్లెక్స్‌కు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని అధికారులు చెప్తున్నారు.

ఇదీ చదవండి: స్వాతంత్య్ర వేడుకలు పేదలకు భారం కావడం దురదృష్టకరం.. సిగ్గుచేటు

మరిన్ని వార్తలు