డజను మామిడి పండ్లు రూ.1.20 లక్షలు.. కారణమిదే

28 Jun, 2021 11:55 IST|Sakshi

రాంచీ: కరోనా కారణంగా స్కూళ్ళన్నీ మూసివేయండంతో, విద్యార్ధులు అంతా ఇంటికి పరిమితం అయ్యారు. దీంతో పాఠశాల యాజమాన్యాలు ఆన్ లైన్ తరగతుల్ని ప్రారంభించారు. కరోనా కారణంగా ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న తల్లిదండ్రులకు ఆన్‌లైన్‌ క్లాస్‌లు పెద్ద సమస్యగా మారింది. మూడుపూటల తినడానికే లేని వారికి స్మార్ట్‌ ఫోన్‌, కంప్యూటర్‌లు అంటే కష్టం. దాంతో చాలా మంది పేద విద్యార్థులు నష్టపోతున్నారు.

ఈ క్రమంలో జంషెడ్పూర్‌కు చెందిన తులసి కుమారి అనే పదకొండేళ్ల బాలిక ఆన్‌లైన్‌లో చదువుకునేందుకు స్మార్ట్ ఫోన్ కొనుక్కునే స్థోమత లేక రోడ్డుపై మామిడి పండ్లు అమ్ముకుంటూ జీవిస్తోంది. ఈమెపై స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ఇవి చూసి చలించిపోయిన ముంబైకి చెందిన అమెయా హేతే ఆమెకు ఏ విధంగానైనా సాయం చేయాలని నిశ్చయించుకున్నాడు.

ఆన్‌లైన్‌ క్లాస్‌లు వినేందుకు స్మార్ట్‌ ఫోన్‌ కొనుక్కోవాలనే ఆ చిన్నారి కోరిక నేరవేర్చేందుకు ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో ఆమె అమ్ముతున్న మామిడి పండ్లను ఒక్కక్కొటి రూ. 10వేలు చొప్పున .. 12మామిడి పండ్లను లక్షా 20వేలకు అమెయా  హేతే  కొనుగోలు చేశాడు. డజను మామిడి పళ్లు ఇంత భారీ ధరకు అమ్ముడుపోవడంతో తులసి ఆనందానికి హద్దుల్లేవు. తన కుమార్తె చదవుకునేందుకు సాయం చేసిన అమెయా హేతే కు ఆమె తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. 

చదవండి: ఒక్క రోజులో 86 లక్షలకు పైగా టీకాలు వేసి చరిత్ర సృష్టించాం: మోదీ

మరిన్ని వార్తలు