నటుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జయా బచ్చన్

15 Sep, 2020 11:04 IST|Sakshi

న్యూఢిల్లీ: బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వినియోగం విపరీతంగా ఉందని భోజ్‌పూరి నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్‌ పార‍్లమెంట్‌ సమావేశాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సమాజ్‌వాది పార్టీ ఎంపీ జయాబచ్చన్‌ తీవ్రంగా మండి పడ్డారు. కొందరి కోసం అందరిని విమర్శించడం తగదన్నారు. ఈ సందర్భంగా జయా బచ్చన్‌ మంగళవారం రాజ్యసభలో మాట్లాడుతూ.. ‘కొంతమంది వ్యక్తుల కారణంగా మొత్తం పరిశ్రమను కించపర్చడం సరి కాదు. నిన్న లోక్‌సభలో పరిశ్రమకు చెందిన వ్యక్తే ఈ ఆరోపణలు చేయడంతో నేను ఎంతో సిగ్గు పడ్డాను. ఆయన వ్యాఖ్యలు చూస్తే.. అన్నం పెట్టిన చేతినే నరుక్కున్నట్లుగా ఉంది’ అంటూ తీవ్రంగా మండి పడ్డారు జయా బచ్చన్‌. (చదవండి: డ్ర‌గ్స్ కేసు: నాకేం బాధ లేదు )

బాలీవుడ్‌లో మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని రవి కిషన్‌ అన్నారు. దేశ యువతను నాశనం చేయటానికి కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. పొరుగుదేశాలు ఇందుకు సహకారం అందిస్తున్నాయన్నారు. సోమవారం నాటి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్‌, చైనాలనుంచి ప్రతి ఏటా మత్తు పదార్థాలు దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నాయని, నేపాల్‌, పంజాబ్‌ ద్వారా దేశంలోకి వస్తున్నాయని రవి కిషన్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు