జేఈఈ మెయిన్స్‌: 4 మార్కులు కలపనున్న ఎన్టీఏ

12 Sep, 2020 10:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ: ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర ప్రఖ్యాత ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ‘జేఈఈ మెయిన్స్‌’ ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. 24 మంది విద్యార్థులు ఈ పరీక్షలో 100 పర్సంటైల్‌ సాధించారు. వీరిలో ఎనిమిది మంది తెలంగాణకు చెందిన విద్యార్థులే కావడం విశేషం. ఆ తరువాత స్థానంలో ఐదుగురు విద్యార్థులతో ఢిల్లీ ఉంది. రాజస్తాన్‌ నుంచి నలుగురు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురు, హరియాణా నుంచి ఇద్దరు, గుజరాత్, మహారాష్ట్రల నుంచి ఒక్కరు చొప్పున 100 పర్సంటైల్‌ సాధించారు.

కోవిడ్‌–19 కారణంగా రెండు సార్లు వాయిదా పడిన జేఈఈ మెయిన్స్‌ను సెప్టెంబర్‌ 1 నుంచి 6 తేదీల మధ్య, పూర్తి స్థాయిలో కరోనా నిబంధనలను అమలు పరుస్తూ, నిర్వహించారు. జేఈఈ మెయిన్స్‌ కోసం 8.58 లక్షల మంది రిజిస్టర్‌ చేసుకోగా, వారిలో 74% మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. 

కెమిస్ట్రీలో ఒక ప్రశ్న తొలగింపు 
జేఈఈ మెయిన్స్‌ ఫైనల్‌ ఆన్సర్‌ కీని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్టీఏ) శుక్రవారం రాత్రి విడుదల చేసింది. దీనిలో రోజు వారీగా, సెషన్‌ వారీగా ప్రశ్న ఐడీ, సరైన సమాధానం ఐడీలను విడుదల చేసింది. 3వ తేదీన ఉదయం సెషన్లో ఇచ్చిన కెమిస్ట్రీ ప్రశ్నల్లో ఒక ప్రశ్న తప్పుగా ఉండడంతో దాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ ప్రశ్నకు సంబంధించి ఆ సెషన్లో పరీక్ష రాసిన వారికి 4 మార్కులు కలపనున్నట్లు ఎన్టీఏ పేర్కొంది.

చదవండి: తెలంగాణ విద్యార్థులే టాప్‌! 

>
మరిన్ని వార్తలు