అమర్‌నాథ్‌ పూజలు జియో టీవీలో..

17 Jul, 2021 02:31 IST|Sakshi

జమ్మూ: అమర్‌నాథ్‌ క్షేత్రానికి సంబంధించిన పూజలు జియో టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. లైవ్‌ స్ట్రీమింగ్‌ అవసరమైన పరికరాలను ఇప్పటికే జియో కంపెనీ అక్కడికి తరలించింది. కశ్మీర్‌లోని భౌగోళిక పరిస్థితులు గడ్డుగా ఉన్నప్పటికీ, వాటిని విజయవంతంగా అక్కడికి చేర్చగలిగింది. ఈ నేపథ్యంలో శ్రీ అమర్‌నాథ్‌జీ క్షేత్ర బోర్డు అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యార్థం పూజలను లైవ్‌ ద్వారా ప్రసారం చేయనున్నట్లు ప్రకటించారు.

పూజ, హవనం, ప్రసాదం వంటి వాటిని ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చని చెప్పారు. అక్కడ ఉండే పూజారులు బుక్‌ చేసుకున్న వారి పేరు మీద పూజ జరిపిస్తారని పేర్కొన్నారు. ప్రసాదం నేరుగా ఇంటికే వచ్చేలా డెలివరీ సదుపాయం తీసుకొచ్చినట్లు చెప్పారు. కోట్లాది మంది భక్తుల కోసం పూజాది కార్యక్రమాలన్నింటిని జియో టీవీకి చెందిన సర్వీసుల ద్వారా దైవానుభూతి కలిగించే ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. కరోనా కారణంగా ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రను ఆ క్షేత్ర బోర్డు రద్దు చేసిన సంగతి తెలిసిందే.   

మరిన్ని వార్తలు