సిప్పీ హత్య కేసులో సంచలనం.. ఏడేళ్ల తర్వాత ప్రేయసి కళ్యాణిని అరెస్ట్‌ చేసిన సీబీఐ

15 Jun, 2022 18:39 IST|Sakshi
(ఫైల్‌ ఫొటో) కళ్యాణితో సిప్పీ సిద్ధూ కుడి పక్కన

చండీగఢ్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షూటర్‌ సిప్పీ సిద్ధూ కేసులో.. ఏడేళ్ల తర్వాత ఎట్టకేలకు సీబీఐ తొలి అరెస్ట్‌ చేసింది. హిమాచల్‌ ప్రదేశ్‌ తాత్కాలిక న్యాయమూర్తి సబీనా కూతురు, ప్రొఫెసర్‌ కళ్యాణిని బుధవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్‌ చేశారు. సిద్ధూ గర్ల్‌ఫ్రెండ్‌గా ఉన్న కళ్యాణిపైనే తొలినాటి నుంచి అందరికీ అనుమానం ఉంది. 

నేషనల్‌ లెవల్‌ షూటర్‌ సుఖ్‌మన్‌ప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ సిప్పీ సిద్ధూ(35) 2015, సెప్టెంబర్‌ 15వ తేదీన దారుణ హత్యకు గురయ్యాడు. సిద్ధూ షూటర్‌ మాత్రమే కాదు.. కార్పొరేట్‌ లాయర్‌ కూడా. పైగా ఛండీగఢ్‌ మాజీ సీజే ఎస్‌ఎస్‌ సిద్ధూ మనవడు. రిలేషన్‌షిప్‌ బెడిసి కొట్టడంతోనే ఆమె సిప్పీని హత్య చేయించిందని సమాచారం. ఛండీగఢ్‌ సెక్టార్‌ 27లో బుల్లెట్లు దిగబడిని అతని మృతదేహాన్ని అప్పట్లో పోలీసులు గుర్తించారు.

జాతీయ షూటర్‌, పైగా హైఫ్రొఫైల్‌ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కావడంతో.. సిప్పీ సిద్ధూ కేసు సంచలనం సృష్టించింది. చివరకు.. పంజాబ్‌ గవర్నర్‌ జోక్యంతో.. 2016లో కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసులో క్లూ అందించిన వాళ్లకు ఐదు లక్షల రూపాయలు నజరానా ప్రకటించింది సీబీఐ.

అంతేకాదు.. సిప్పీ హత్య జరిగిన సమయంలో ఓ యువతి అతనితో ఉందని, ఆమె ఎవరో ముందుకు వస్తే.. ఆమెను నిరపరాధిగా భావించాల్సి ఉంటుందని, లేకుంటే.. ఆమెకు కూడా హత్యలో భాగం ఉందని భావించాల్సి ఉంటుందని ఏకంగా సీబీఐ ఒక పేపర్‌ ప్రకటన ఇచ్చింది కూడా. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే.. ఇది అతని ప్రేయసి కళ్యాణి చేయించిన హత్యేనని, ఆమెను అరెస్ట్‌ చేయాలంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున్న చర్చే నడిచింది. 

మరోవైపు  2021లో ఈ కేసులో నజరానాను ఏకంగా పది లక్షల రూపాయలకు పెంచింది సీబీఐ. ఇక 2020లో సిప్పీతో ఉన్న మహిళను గుర్తించలేకపోయామని కోర్టు తెలిపి.. కేసులో దర్యాప్తు కొనసాగిస్తామని తెలిపింది. 

కళ్యాణి సింగ్‌ను కూలంకశంగా ప్రశ్నించిన తర్వాతే.. అరెస్ట్‌ చేసినట్లు సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. ఆపై ప్రత్యేక న్యాయమూర్తి సుఖ్‌దేవ్‌ సింగ్‌ ఎదుట ఆమెను హాజరుపరిచి.. నాలుగు రోజుల కస్టడీకి తీసుకుంది సీబీఐ.

(చదవండి: స్కూల్స్‌లో కరోనా కలకలం.. 31 మం‍ది విద్యార్థులకు పాజిటివ్‌.. టెన్షన్‌లో అధికారులు)

మరిన్ని వార్తలు