వీళ్ల వివాహాలు హాట్‌ టాపిక్‌.. అధికార పగ్గాల తర్వాత లగ్గం చేసుకుంది వీళ్లే!

7 Jul, 2022 21:30 IST|Sakshi

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌(49) వివాహం ఇవాళ వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. దగ్గరి బంధువు డాక్టర్‌ గుర్‌ప్రీత్‌ కౌర్‌(32)తో కొద్దిమంది సమక్షంలోనే ఆయన వివాహం జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో ఆయన వివాహం జరగడం చర్చనీయాంశంగా మారగా.. గతంలోనూ ఇలా రాజకీయంగా అత్యున్నత హోదాలో ఉండి.. మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రముఖులు చాలా మందే ఉన్నారు.


హెచ్‌డీ కుమారస్వామి
జేడీ(ఎస్‌) నేత హెచ్‌డీ కుమారస్వామి.. కర్ణాటక ముఖ్యమంత్రిగా 2006-07 మధ్య కాలంలో పని చేశారు. 1986లోనే ఆయనకు వివాహం అయ్యింది. అయితే.. 2006లో ఆయన కన్నడ నటి రాధికను రహస్యంగా రెండో వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత రాధిక తనంతట తానుగా ప్రకటించేదాకా ఈ విషయం బయటకు తెలీలేదు. ఆ తర్వాత కుమారస్వామి కూడా ఆ విషయాన్ని అంగీకరించారు.

 

వీర్‌భద్ర సింగ్‌
హిమాచల్‌ ప్రదేశ్‌ రాజకీయాల్లో తిరుగులేని నేత ఈయన. 1962, 1967, 1971లో.. మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే 1983లో వీర్‌భద్ర సింగ్‌.. హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఏడేళ్లపాటు సీఎంగా ఉన్నారు. ఆ సమయంలోనే 1985లో ప్రతిభా సింగ్‌ను రెండో వివాహం చేసుకున్నారు ఆయన. మొదటి భార్య రత్నకుమారి(జుబ్బల్‌ యువరాణి) అప్పటికే అనారోగ్యంతో మరణించింది. ప్రతిభా సింగ్‌ ఎవరో కాదు.. మండి లోక్‌ సభ ఎంపీ.
   
  
బాబుల్‌ సుప్రియో
మాజీ కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో. 2015లో మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న ఈయన.. 2019లో మోదీ కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా ఉండగానే ఎయిర్‌ హోస్టెస్‌ రచనా శర్మను రెండో వివాహం చేసుకున్నారు. ముంబై నుంచి కోల్‌కతా  మధ్య ఫ్లైట్‌లో ప్రయాణించేప్పుడు వాళ్ల మధ్య పరిచయం అయ్యింది.
 

చందర్‌ మోహన్‌
హర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి. ఈయన వివాహ జీవితం వివాదాస్పదంగా నిలిచింది. 2008లో మంత్రి పదవిలో ఉన్నప్పడు.. ప్రేయసి అనురాధా బాలి కోసం మతం మార్చుకున్నాడు ఆయన. భార్య సీమా భిష్ణోయ్‌ సమ్మతితోనే..  చాంద్‌ మొహమ్మద్‌, ఫిజా(అనురాధా బాలి)గా ఇద్దరూ పేర్లు మార్చుకుని మరీ వివాహం చేసుకున్నారు. కానీ, ఈ చర్య ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఘోరంగా దెబ్బ తీసింది. అయితే ఈ ప్రేమ కథ ఎన్నోరోజులు సాఫీగా సాగలేదు. కొన్నిరోజులకే ఇద్దరూ విడిపోగా.. 2012లో బాలి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.

ప్రఫుల్లా కుమార్‌ మహంతా
అస్సాం మాజీ ముఖ్యమంత్రి. 1985 డిసెంబర్‌ నుంచి 1990 వరకు ఆయన సీఎంగా విధులు నిర్వహించారు. సీఎంగా ఉన్న టైంలో 1988లో జయశ్రీ గోస్వామి మహంతను ఆయన వివాహం చేసుకున్నారు. రైటర్‌ అయిన జయశ్రీ గోస్వామి.. ఆ తర్వాత రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు కూడా. అయితే.. అసెంబ్లీ సెక్రటేరియెట్‌ ఎంప్లాయి సంఘమిత్ర భరాలిని ఆయన రహస్యంగా రెండో వివాహం చేసుకున్నారన్న ఆరోపణలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి.


భార్య జయశ్రీ గోస్వామితో ప్రఫుల్లా కుమార్‌ మహంతా

మరిన్ని వార్తలు