సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఎన్వీ రమణ

6 Apr, 2021 12:26 IST|Sakshi

అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ

ఏప్రిల్‌ 24న బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్‌ ఎన్వీ రమణ

సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టు 48వ చీఫ్‌ జస్టిస్‌గా ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తన తర్వాత ఆ స్థానంలో జస్టిస్ ఎన్వీ రమణను నియమించాల్సిందిగా కోరుతూ... ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే... ప్రతిపాదన పంపగా, రాష్ట్రపతి ఆమోదించారు. ఏప్రిల్‌ 24, 2021న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఆగస్టు 26, 2022 వరకు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఎన్వీ రమణ బాధ్యతలు నిర్వహిస్తారు. 

కృష్ణా జిల్లా పొన్నవరంలో ఆగస్టు 27, 1957న జస్టిస్‌ ఎన్‌వీ రమణ జన్మించారు. 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. ఉమ్మడి ఏపీ హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర ట్రైబ్యునళ్లు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, కార్మిక, ఎన్నికల అంశాల్లో కేసులు వాదించారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార కేసులు, క్రిమినల్‌ కేసుల్లో నిపుణుడిగా పేరు పొందారు. పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానెల్‌ కౌన్సిల్‌గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్‌ కౌన్సిల్, క్యాట్, హైదరాబాద్‌లో రైల్వే స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా జూన్‌ 27, 2000 నుంచి సెప్టెంబరు 1, 2013 వరకు కొనసాగిన జస్టిస్‌ రమణ కొంతకాలం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. సెప్టెంబరు 2, 2013 నుంచి ఫిబ్రవరి 16, 2014 వరకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఫిబ్రవరి 17, 2014న పదోన్నతితో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్‌ బాబ్డే తర్వాత అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ(నల్సా) కార్యనిర్వాహక ఛైర్మన్‌గా ఉన్నారు.


చదవండి:
అద్భుతం సృష్టించిన భారతీయ రైల్వే
దేశ్‌ముఖ్‌ వ్యవహారం: సీఎం నోరు విప్పడం లేదేంటి?

>
మరిన్ని వార్తలు