Telangana: రేపు సీజేగా జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మ ప్రమాణం

10 Oct, 2021 08:48 IST|Sakshi
జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా

13 హైకోర్టు సీజేల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర

ఏపీ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ పీకే మిశ్రా

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర రానున్నారు. అలాగే ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ పీకే మిశ్రా నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా 13 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సెప్టెంబర్‌ 16న సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ పీకే మిశ్రా, తెలంగాణ హైకోర్టు సీజేగా సతీష్‌చంద్ర శర్మ నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. 

రేపు నూతన సీజే ప్రమాణం 
హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11.05 నిమిషాలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళసై సౌందరాజన్‌ సీజేతో ప్రమాణం చేయిస్తారని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ అనుపమ చక్రవర్తి శనివారం తెలిపారు.   

జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ... 
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ 1961 నవంబర్‌ 30న మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జన్మించారు. ఆయన తండ్రి బి.ఎన్‌.శర్మ భోపాల్‌లోని భర్కతుల్లా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, తల్లి శాంతి శర్మ జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేశారు. ప్రాథమిక విద్య జబల్‌పూర్‌లోని సెంట్రల్‌ స్కూల్‌లో పూర్తి చేశారు. 1981లో డాక్టర్‌ హరిసింగ్‌గౌర్‌ వర్సిటీ నుంచి బీఎస్సీ పట్టా అందుకున్నారు. మూడు సబ్జెక్ట్‌ల్లో డిస్టింక్షన్‌ సాధించి నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పొందారు. అదే వర్సిటీలో న్యాయ పట్టా అందుకొని 1984, సెప్టెంబర్‌ 1న మధ్యప్రదేశ్‌ బార్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. ఎల్‌ఎల్‌బీలోనూ మూడు బంగారు పతకాలు సాధించారు. రాజ్యాంగం, సేవలు, సివిల్, క్రిమినల్‌ విషయాల్లో ప్రాక్టీస్‌ చేశారు. 1993లో అడిషనల్‌ సెంట్రల్‌ గవర్నమెంట్‌ కౌన్సెల్‌గా నియమితులయ్యారు.

2004లో సీనియర్‌ ప్యానెల్‌ కౌన్సెల్‌గా పదోన్నతి పొందారు. 2003లో మధ్యప్రదేశ్‌ హైకోర్టు నుంచి సీనియర్‌ న్యాయవాది హోదాను పొందారు. 42 ఏళ్లకే ఈ హోదా పొందిన వ్యక్తిగా గుర్తింపు దక్కించుకున్నారు. 2008, జనవరి 18న మధ్యప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010, జనవరి 15న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన పలు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలతో అనుసంధానమై ఉన్నారు. ఎన్నో పరిశోధన పత్రాలు ప్రచురించారు. కర్ణాటక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓక్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆగస్టు 31 నుంచి ఆ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. తాజాగా తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా... 
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా నియమితులైన జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర 1964 ఆగస్టు 29న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గడ్‌లో జన్మించారు. బిలాస్‌పూర్‌ లోని గురు ఘాసిదాస్‌ వర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. 1987, సెప్టెంబర్‌ 4న న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకొని రాయ్‌గఢ్‌లోని జిల్లా కోర్టు, జబల్‌పూర్‌లోని మధ్యప్రదేశ్‌ హైకోర్టు, బిలాస్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుల్లో ప్రాక్టీస్‌ చేశారు. ఛత్తీస్‌గఢ్‌ బార్‌ కౌన్సిల్‌కు చైర్మన్‌గా పనిచేశారు. 2004, జూన్‌ 26 నుంచి 2007, ఆగస్టు 31 వరకూ రాష్ట్ర అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేశారు. 2007, సెప్టెంబర్‌ 1 వరకూ అడ్వొకేట్‌ జనరల్‌గా కొనసాగారు. 2009, డిసెంబర్‌ 10న ఛత్తీస్‌గఢ్‌ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్న ఆయన.. తాజాగా ఏపీ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.  

మరిన్ని వార్తలు