మహిళపై బీజేపీ నేతల దాడి.. వీడియో షేర్‌ చేసిన కమల్‌నాథ్‌

22 Aug, 2020 09:44 IST|Sakshi

భోపాల్‌ : దళిత మహిళపై బీజేపీ నేతలు దాడికి పాల్పడ్డారని, బాధితురాలి కూతురు తమ తల్లినిపై దాడి చేయొద్దని వేడుకున్నా.. వదల్లేదని ఆరోపిస్తూ మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత కమల్‌నాథ్‌ఓ వీడియోను ట్వీటర్‌లో షేర్‌ చేశారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ఆడపడుచులకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. కమల్‌నాథ్‌ పోస్ట్‌ చేసిన వీడియోలో ఓ మహిళపై ఓ వ్యక్తి దాడికి దిగాడు. ఆమెను నెట్టేస్తూ తీవ్రంగా కొట్టాడు. ఊడిపోతున్న తన పంచెను సరిచేసుకుంటూ మరీ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాధితురాలి కుమార్తె... తన తల్లిని విడిచిపెట్టాలంటూ గట్టిగా కేకలు పెట్టింది. అయినప్పటికీ వాళ్లు వినిపించుకోలేదు.(చదవండి : మ‌నిషి పెరిగినా బుద్ధి పెర‌గ‌క‌పోతే ఇంతే..)

ఈవీడియోను కమల్‌నాథ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘బేతుల్ జిల్లాలోని శోభాపూర్ లో బీజేపీ నాయకులపై నిరసన వ్యక్తం చేసినందుకు ఒక దళిత మహిళ, ఆమె కుమార్తెపై ఆ పార్టీ నాయకులు బహిరంగంగా దాడి చేశారని హిందీలో ట్వీట్‌ చేశారు.  దళిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆ నాయకులపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పైగా దాడికి పాల్పడిన నేతలకు పోలీసులు అండగా నిలిచారని ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘శివరాజ్‌ జీ, మీ ప్రభుత్వంలో సోదరీమణులకు తరచూ ఇలాంటి సంఘటనలు ఎదురవుతున్నాయి. పోలీసులు నిందితులకు రక్షణ కల్పిస్తున్నారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకొని సదరు మహిళలకు, ఆమె కుమార్తెకు న్యాయం చేయాలి’అని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను కమల్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు