‘ఐటెం’ వ్యాఖ్యలపై కమల్‌ నాథ్‌ వివరణ

19 Oct, 2020 17:35 IST|Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ మంత్రి ఇమర్తి దేవిపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మాజీ సీఎం కమల్‌ నాథ్‌ వివరణ ఇచ్చారు. తాను ఎవరినీ అవమానించలేదని, క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను మాట్లాడిన అంశంలో ఎవరినీ అవమానపరిచే వ్యాఖ్యలు లేవని, అసలు ఆ వ్యక్తి పేరేంటో కూడా తనకు గుర్తులేదని చెప్పుకొచ్చారు. తన చేతిలో ఉన్న జాబితా చూపుతూ ఇందులో ఐటెం నెంబర్‌ వన్‌, టూ అంటూ పేర్లున్నాయి..ఇది అవమానించడం అవుతుందా అని ప్రశ్నించారు.

శివరాజ్‌ చౌహాన్‌ తప్పులు వెతుకుతున్నారని, కమల్‌నాథ్‌ ఏ ఒక్కరినీ అవమానించ లేదని అన్నారు. వాస్తవాలతోనే ఆయన మీ లోపాలు బయటపెడతారని వ్యాఖ్యానించారు. కాగా, ఆదివారం గ్వాలియర్‌ దాబ్రా పట్టణంలో నిర్వహించిన ఉప ఎన్నికల‌ ప్రచారంలో మాజీ సీఎం కమల్‌నాథ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో ఆయన తమ ప్రత్యర్థి ఇమర్తి దేవిని ఉద్దేశిస్తూ ‘ఐటం’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కమల్‌ నాథ్‌ వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఇమర్తి దేవిపై చేసిన వ్యాఖ్యలకు  నిరసనగా ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సోమవారం రెండు గంటలపాటు మౌన దీక్ష చేపట్టారు.

ఇక జ్యోతిరాదిత్య సింధియాకు విధేయురాలైన ఇమార్తి దేవి, మరో 21 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్, రాష్ట్ర అసెంబ్లీకి రాజీనామా చేసి, కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టి.. మార్చిలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 28 అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 3న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 10 న జరుగుతుంది. చదవండి : మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు