BJP Suspends Nupur Sharma: వివాదాస్పద వ్యాఖ్యలు.. నూపుర్‌ శర్మను సస్పెండ్‌ చేసిన బీజేపీ

5 Jun, 2022 17:05 IST|Sakshi

న్యూఢిల్లీ: మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. నూపుర్‌ శర్మతోపాటు ఢిల్లీ బీజేపీ మీడియా ఇన్‌ఛార్జ్ నవీన్ కుమార్ జిందాల్‌ను కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగిస్తున్నట్లు ఆదివారం వెల్లడించింది. నవీన్‌ కుమార్‌ జిందాల్‌ ఢిల్లీ బీజేపీ మీడియా హెడ్‌గా ఉన్నారు. సస్పెన్షన్‌ లెటర్‌లో ‘ పార్టీ వైఖరికి విరుద్ధంగా మీ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోంది. కావున మిమ్మల్ని పార్టీ నుంచి, మీ బాధ్యతల నుంచి తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నామం’ అని బీజేపీ కేంద్ర క్రమశిక్షణా సంఘం పేర్కొంది.

కాగా, ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో శుక్రవారం హింస చెలరేగిన విషయం తెలిసిందే. నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై పరేడ్ మార్కెట్‌లోని దుకాణాలను మూసివేయాలని ముస్లిం వర్గం పిలుపునిచ్చింది. యతింఖానా చౌరహా వద్ద మార్కెట్ బంద్ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.  ఈ క్రమంలో గొవడలు చెలరేగాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అయితే పోలీసులపై కొందరు రాళ్లతో దాడి చేశారు. దీంతో స్థానికంగా అల్లకల్లోల పరిస్థితి నెలకొంది. ఈ ఘర్షణల్లో 20 మంది పోలీసులతో సహా 40 మంది గాయపడ్డారు. 
చదవండి: డబ్బులు వృధా చేసుకోవద్దు. మా వద్ద లేనిది ఈడీ మాత్రమే: సంజయ్‌ రౌత్‌

ఇదిలా ఉండగా.. వివాదంలో ఉన్న జ్ఞానవాపి మసీదు విషయంలో ఓ టీవీ చర్చలో పాల్గొన్న నూపుర్‌.. ఇస్లామిక్ మతపరమైన పుస్తకాలలోని కొన్ని విషయాలను ప్రజలు ఎగతాళి చేస్తున్నారని అనిపిస్తుందన్నారు. మసీదు కాంప్లెక్స్‌లో కనిపించిన శివలింగాన్ని ఫౌంటెన్‌గా పిలుస్తూ ముస్లింలు హిందూ విశ్వాసాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడింది. అయితే ముస్లింల మనోభావాలను దెబ్బతీసినందుకు నూపుర్ శర్మపై హైదరాబాద్, పూణె, ముంబైలలో కేసులు నమోదయ్యాయి.

అన్ని మతాలను గౌరవిస్తాం
అయితే నూపుర్ శర్మపై సస్పెన్షన్‌ వేటుకు కొద్దిసేపటి ముందే బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌  ప్రకటన విడుదల చేశారు. ఒక మతాన్ని, వర్గ మనోభావాలను దెబ్బతీసే ఆలోచనలకు పార్టీ అంగీకరించదని అన్నారు. బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుందనని, ఎవరైనా మతపరంగా మనోభావాలను దెబ్బతీస్తే, మతపరమైన వ్యక్తులను అవమానించడాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. 

మరిన్ని వార్తలు