బీజేపీ సీనియర్‌ నేత, డిప్యూటీ స్పీకర్‌ ఆనంద్‌ కన్నుమూత.. సీఎం దిగ్భ్రాంతి 

23 Oct, 2022 11:27 IST|Sakshi

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కర్నాటక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఆనంద్‌ మమణి(56) తుదిశ్వాస విడిచారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కన్నుమూసినట్టు వైద్యులు వెల్లడించారు. 

అయితే, డిప్యూటీ స్పీకర్‌ ఆనంద్‌ మమణి(56) మధుమేహ వ్యాధిలో ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలో షుగర్‌ వ్యాధి కారణంగా లివర్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురైంది. దీంతో, ఆనంద్‌ను బెంగళూర్‌లోని మణిపాల్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆనంద్‌ మమణి.. కోమాలోకి వెళ్లిపోయారు. అనంతరం, మెరుగైన వైద్యం కోసం ఆయనను తమిళనాడులోకి చెన్నైలోకి ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సేవల అనంతరం.. మళ్లీ బెంగళూరుకు తీసుకువచ్చారు.

కాగా, తాజాగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆనంద్‌ తుదిశ్వాస విడిచారు. ఇక, ఆనంద్‌ మమణి.. బెలగావి జిల్లాకు చెందిన సవదట్టి నియోజకవర్గం నుంచి మూడుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం.. డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. మరోవైపు.. ఆనంద్‌ మమణి మృతిపై కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై స్పందించారు. సీఎం బొమ్మై ట్విట్టర్‌ వేదికగా.. “మా పార్టీ ఎమ్మెల్యే, గౌరవనీయులైన రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఆనంద చంద్రశేఖర మామణి మరణవార్త తెలిసి చాలా బాధపడ్డాను. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ఈ బాధను భరించే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి’’ అంటూ నివాళులు అర్పించారు. 
 

మరిన్ని వార్తలు