సరిహద్దుపై మహారాష్ట్రతో ఢీ అంటే ఢీ.. కర్ణాటక అసెంబ్లీలో తీర్మానం

22 Dec, 2022 21:19 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం ఇటీవల తారస్థాయికి చేరింది. తమ భూభాగాన్ని ఇచ్చేదే లేదంటూ ఇరు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ఈ క్రమంలోనే సరిహద్దు వివాదంపై కర్ణాటక అసెంబ్లీ తీర్మానం చేసింది. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకే కట్టుబడి ఉంటామని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. సరిహద్దు వివాదాన్ని మహారాష్ట్రనే సృష్టించిందని ఖండించింది. ఈ తీర్మానాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై సభలో ప్రవేశపెట్టగా మూజువాణి ఓటు ద్వారా ఆమోదం తెలిపారు. 

‘కర్ణాటక భూభాగం, నీళ్లు, భాష, కన్నడ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. కర్ణాటక ప్రజలు, అసెంబ్లీ సభ్యుల మనోభావాలు ఈ అంశంలో ఒకటి. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడానికి మనమందరం ఐక్యంగా రాజ్యాంగ, చట్టపరమైన చర్యలు తీసుకోవాడనికి కట్టుబడి ఉన్నాం. అనవసరంగా సరిహద్దు వివాదాన్ని సృష్టిస్తున్న మహారాష్ట్ర ప్రజల తీరును ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు సిద్ధమని తెలిపే ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది.’ అని సభలో తీర్మానాన్ని చదవి వినిపించారు సీఎం బసవరాజ్‌ బొమ్మై. 

అంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో సరిహద్దు వివాదంపై మాట్లాడారు సీఎం బొమ్మై. అది కర్ణాటక ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయమని, ఒక్క అంగుళం కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు. తమ భూభాగాన్ని రక్షించుకునేందుకు ఎంత వరకైనా వెళ్తామని, ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.  

ఇదీ చదవండి: కరోనా కొత్త వేరియంట్‌ ‘బీఎఫ్‌.7’ లక్షణాలివే..

మరిన్ని వార్తలు