Viral Video: ఏనుగు దాడిలో మహిళ మృతి.. ఎమ్మెల్యేపై గ్రామస్థుల దాడి.. తరిమి తరిమి కొట్టిన జనం

21 Nov, 2022 12:28 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఓ ఎమ్మెల్యేను గ్రామస్థులు చితకొట్టారు. తరిమి తరిమి అతనిపై దాడి చేశారు. ఈ ఘటన చిక్కమగళూరులో ఆదివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.. అసలేం జరిగిందంటే.. చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా హల్లేమనె కుందూరులో ఏనుగు దాడిలో ఓ మహిళ మృతి చెందింది. దీంతో తమ ప్రాంతంలో తరుచూ ఏనుగు బారిన పడి ప్రజలు చనిపోతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదంటూ మృతదేహంతో గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.

ఈ సమయంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కుమారస్వామి ఆదివారం సాయంత్రం అక్కడకు వెళ్లారు. అయితే మృతదేహంతో తాము ఉదయం నుంచి ఆందోళన చేస్తుంటే తీరిగ్గా  సాయంత్రం వస్తారా అంటూ మ్మెల్యేపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కూడా అంతే తీవ్రంగా బదులివ్వడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రెచ్చిపోయిన జనం ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఊరు నుంచి తరిమి తరిమి  కొట్టారు.

ఈలోపు అక్కడికి చేరుకున్న పోలీసులు అతికష్టం మీద ఎమ్మెల్యేను కాపాడి, తరలించారు. కాగా ఏనుగు దాడిలో చనిపోయిన బాధిత కుటుంబ సభ్యలను పరామర్శించడానికి వెళ్తే గ్రామస్థులు తనపై దాడి చేశారని ఎమ్మెల్యే కుమారస్వామి ఆరోపించారు. ఈ ఘటనలో  ఎమ్మెల్యే చొక్కా కూడా చిరిగిపోయింది. 

ఏనుగు దాడిలో మహిళ మృతి..  భర్త కళ్ల ముందే ఘోరం  
ఏనుగు దాడిలో మహిళ మృతి చెందిన ఘటన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా హల్లేమనె కుందూరులో జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పశువులకు మేత కోయడానికి సతీశ్‌గౌడ, శోభ దంపతులు పొలానికి వెళ్లారు. ఒక్కసారిగా ఏనుగు ఇద్దరిపై దాడికి యత్నించగా పరుగులు తీశారు. శోభను ఏనుగు వెంబడించి ఆమెను తొక్కి చంపేసింది. కళ్ల ముందే భార్య చనిపోవడంతో భర్త తీవ్రంగా విలపించాడు. గతంలోను కెంజి గ్రామానికి చెందిన ఆనంద దేవాడిగను ఏనుగు ఇలాగే బలిగొంది, ఈ ఘటనతో గ్రామస్థులు భయందోళనకు గురవుతున్నారు.   

మరిన్ని వార్తలు