రూల్స్‌ బ్రేక్‌ చేసిన సీఎం కుమారుడు, భార్యతో కలిసి..

19 May, 2021 15:09 IST|Sakshi
నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఎదుట పోలీస్‌ బందోబస్త్‌

బెంగళూరు: దేశవ్యాప్తంగా కరోనా కట్టడి చర్యలు కొనసాగుతున్నాయి. చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. అయితే వాటిని కొందరు పట్టించుకోవడం లేదు. తాజాగా ముఖ్యమంత్రి యడియూరప్ప కుమారుడే స్వయంగా లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించారు. సీఎం కుమారుడు, బీజేపీ కర్ణాటక ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్ర తన భార్యతో కలిసి మైసూర్ జిల్లా నంజనగూడులోని కంఠేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం ఉదయం సందర్శించారు.

భార్యతో కలిసి గర్భ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అర్థగంటకు పైగా ఆ ప్రాంతంలో ఉన్నారు. ఆయన సందర్శన నేపథ్యంలో భారీ ఎత్తున పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం తనయుడు కావడంతో ఆలయ అధికారులు కూడా కోవిడ్‌ నిబంధనల్ని పక్కన పెట్టేశారు. ఆయనకు వీఐపీ మర్యాదలన్నీ చేశారు. కాగా, బీవై విజయేంద్ర ఆలయ సందర్శన కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతోంది. సీఎం కుమారుడికి నిబంధనలు వర్తించవా? అని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. 

వాస్తవంగా కర్ణాటకలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో ఆలయాలన్నీ మూసివేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన రూల్స్‌ను బ్రేక్‌ చేసిన విజయేంద్రపై చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రత్యేకంగా విజయేంద్ర ఆలయంలో పూజలు చేపట్టడం పలు విమర్శలకు దారితీసింది. సామాన్యులకు ఒక రూల్.. నాయకులకు ఒక నిబంధన ఉంటదా? అని స్థానికులూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో విజయేంద్రపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చదవండి: గొర్రెల ధర్నా: బర్త్‌ డే నాడు గవర్నర్‌కు చేదు అనుభవం

మరిన్ని వార్తలు