డీకే శివకుమార్‌కు కోవిడ్‌-19 పాజిటివ్‌

25 Aug, 2020 15:47 IST|Sakshi

ఆస్పత్రిలో చేరిన డీకేశీ

బెంగళూర్‌ : కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌కు కరోనా పాజిటివ్‌గా వెల్లడైందని మంగళవారం ఆయన స‍్వయంగా వెల్లడించారు. తాను ప్రస్తుతం బాగానే ఉన్నానని, ముందుజాగ్రత్తగా ఆస్పత్రిలో చేరానని ఆయన తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జ్వరంతో బాధపడుతున్న తనకు కోవిడ్‌-19 టెస్ట్‌ నిర్వహించగా పాజిటివ్‌గా వచ్చిందని, ముందుజాగ్రత్తతో ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని చెప్పారు. మీ దీవెనలతో తాను ఆరోగ్యంగా తిరిగివస్తానని డీకే శివకుమార్‌ ట్వీట్‌ చేశారు. తనను ఇటీవల కలిసిన వారంతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో వరదలు సంభవించిన ప్రాంతాల్లో తన పర్యటనను వాయిదా వేసుకున్నట్టు ఆయన శనివారం ట్వీట్‌ చేయడం గమనార్హం.

బెలగావి, బాగల్కోట్‌ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తన పర్యటనను ఆరోగ్య కారణాలతో మూడు రోజులు వాయిదా వేస్తున్నట్టు శనివారం ఆయన ట్వీట్‌ చేశారు. ఇక డీకే శివకుమార్‌ త్వరగా కోలుకోవాలని కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఈశ్వర్‌ ఖాండ్రే, జేడీ(ఎస్‌) నేత హెచ్‌డీ కుమారస్వామి ట్వీట్‌ చేశారు. కాగా కరోనా వైరస్‌ బారినపడిన కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప (77), విపక్ష నేత సిద్ధరామయ్య (71)లు వైరస్‌ నుంచి కోలుకున్నారు. వీరితో పాటు ఆరోగ్య మంత్రి శ్రీరాములు సహా నలుగురు మంత్రులకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కోవిడ్‌-19 కేసులు అధికంగా నమోదైన రాష్ట్రాల్లో కర్ణాటక నాలుగో స్ధానంలో ఉంది. కర్ణాటకలో ఇప్పటివరకూ 2.91 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 81,000 యాక్టివ్‌ కేసులున్నాయి. మహమ్మారి బారినపడి 4810 మంది మరణించారు.

చదవండి : ఎవ‌రిని ర‌క్షించేందుకు ఈ ప్ర‌య‌త్నం?

మరిన్ని వార్తలు