Karnataka: కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు

21 Dec, 2021 16:37 IST|Sakshi

బెంగళూరు: నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఉవ్విళ్లూరతున్న కర్ణాటక వాసులకు రాష్ట్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించింది. 

బహిరంగ ప్రదేశాల్లో న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకోవడాన్ని నియంత్రిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం తెలిపారు. డీజేలు లేకుండా క్లబ్‌లు, రెస్టారెంట్లలో 50 శాతం కెపాసిటీతో మాత్రమే వేడుకలకు అనుమతిస్తామన్నారు. ఈ ఆంక్షలు డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు అమలులో ఉంటాయని తెలిపారు. కోవిడ్ -19 టీకాలు వేసుకున్న వారిని మాత్రమే వేడుకలకు అనుమతిస్తామన్నారు. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో కర్ణాటక సర్కారు ఈమేరకు నిర్ణయం తీసుకుంది. 

మరో 5 ఒమిక్రాన్‌ కేసులు 
కర్ణాటకలో తాజాగా మరో 5 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19కి చేరింది. ధార్వాడలో 54 ఏళ్ల వ్యక్తి, తీర్థహళ్లిలో 20 ఏళ్ల యువతి, ఉడుపిలో 82 ఏళ్ల వృద్దుడు, మంగళూరులో 19 ఏళ్ల యువకుడు ఒమిక్రాన్‌ బారిన పడ్డారు. (చదవండి: నాకు జీవం లేదు.. 4 రోజుల క్రితమే చనిపోయాను)

మరోవైపు బెంగళూరులో ఒమిక్రాన్‌ ప్రబలకుండా రద్దీ ప్రాంతాలైన కేఆర్‌ మార్కెట్‌లో మార్షల్స్‌ను పెంచారు. మాస్క్‌ ధరించకపోతే తక్షణమే జరిమానా విధిస్తున్నారు. బెళ్లందూరు, దొడ్డనెక్కుంది, బేగూరు, హగదూరు, హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌ వార్డుల్లో నిత్యం 7కు పైగా కోవిడ్‌ కేసులు వస్తుండడంతో రెడ్‌ జోన్‌గా ప్రకటించారు.  (చదవండి: వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలో కరోనా మూడోవేవ్‌..)

మరిన్ని వార్తలు