ఎన్ఐఏ అనుమానం
కోర్టులో చార్జిషీట్ దాఖలు
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే సమాచారం వెలుగు చూసింది. ఐసిస్ సంస్థ (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాదుల నియామకం కోసం రాజధాని బెంగళూరును వేదికగా చేసుకున్నట్లు ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) అనుమానం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన చార్జ్షీట్ను ఈనెల 18న హైకోర్టు ముందు ఉంచింది. మొత్తం 28 మంది యువకులను చేర్చుకుని శిక్షణ కూడా ఇచ్చినట్లు సమాచారం ఉందని ఎన్ఐఏ పేర్కొంది.
జొహైబ్, అబ్దుల్ ఖాదిర్ అనే ఇద్దరు వ్యక్తులు బెంగళూరులో సుమారు 28 మంది యువకులను చేరదీసి మత విద్వేషాలను నూరిపోసి ఉగ్రవాదంపై బోధనలు చేసినట్లు పిటిషన్లో పేర్కొంది. సిరియా నుంచి బెంగళూరుకు వచ్చిన మహమ్మద్ నాజిద్.. ఆ యువకులను మరింత ప్రేరేపించినట్లు తెలిసింది. ఈయన బెంగళూరు నుంచి సిరియాకు తిరిగి వెళ్లే సమయంలో విమానాశ్రయం వరకు శిక్షణ పొందిన యువకులు వెంట వెళ్లినట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఐసిస్ ఉగ్రవాదుల నియామకం, శిక్షణ కేసుకు సంబంధించి తిలక్నగర్కు చెందిన మహమ్మద్ తౌకిర్ మహమూద్, కామనహళ్లికి చెందిన జొహైబ్ మున్నా, భట్కళ నివాసి మహమ్మద్ సుహాబ్ను ఎన్ఐఏ అధికారులు ఈనెల 19న అరెస్ట్ చేశారు. ముగ్గురిపై చట్ట ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చదవండి: Disha Encounter Case: నివేదిక బట్టబయలు.. వెలుగులోకి సంచలన విషయాలు..