ప్రధానోపాధ్యాయుడి కీచక బుద్ధి.. వ్యాక్సినేషన్‌ వేయడానికి వచ్చిన నర్స్‌పై..

6 Aug, 2021 19:56 IST|Sakshi
నిందితుడిని నిలదీస్తున్న బాధితురాలు

బెంగళూరు: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్‌లు వేసుకునే విధంగా.. ఆయా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, కరోనా వ్యాక్సిన్ వేయడానికి వచ్చిన హెల్త్‌ సెంటర్‌ ఉద్యోగిని పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమానుషంగా ప్రవర్తించి.. అశ్లీల సందేశాలను పంపించాడు. బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన బెళగావిలోని దేగాం ప్రభుత్వ పాఠశాలలో జరిగింది.

కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ ఉద్యోగిని గత రెండు వారాలుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ లు వేస్తుంది. ఈ క్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్‌ చావలాగి .. మహిళా ఉద్యోగి సెల్‌ఫోన్‌ నంబర్‌ను సంపాదించాడు. ఆ తర్వాత.. ప్రతిరోజు ఆమెతో అసభ్యంగా మాట్లాడేవాడు. అంతటితో ఆగకుండా.. అశ్లీల సందేశాలు, ఫోటోలు పంపుతూ తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధించసాగాడు. దీంతో ఆమె అతనికి ప్రవర్తన మార్చుకోవాలని కోరింది. అయినప్పటికి అతగాడు తన వక్రబుధ్ది మార్చుకోలేదు. దీంతో విసిగిపోయిన ఆమె బంధువులు, స్నేహితులకు వేధింపుల విషయాన్ని చెప్పింది.

ఈ క్రమంలో వారంతా కలిసి గడిచిన బుధవారం (ఆగస్టు4) ప్రధానోపాధ్యాయుడి ఛాంబర్‌కు చేరుకుని ఆ కీచకుడిని గదిలో బంధించారు. ఆ తర్వాత అతడికి దేహశుద్ధి చేశారు. అయితే, తాజాగా ఈ సంఘటనకు సంబంధించిన ఫోటో క్లిప్పింగ్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిని సస్పెండ్‌  చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. కాగా, బాధితురాలు సురేష్‌ చావలాగిపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కాగా, ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.   

మరిన్ని వార్తలు