కుక్క కరిచిందా.. అయితే రూ.10వేలు తీసుకోవడం మరచిపోకండి!

6 Jun, 2022 08:37 IST|Sakshi

బాధితులకు బెంగళూరు పాలికె పరిహారం

రూ.10 వేల వరకు సహాయం

నగరవాసులూ.. తెలుసుకోండి

బనశంకరి(బెంగళూరు): కుక్క కాటుకు అదేదో దెబ్బ అని ఒక నానుడి ఉంది. కుక్క కరిస్తే యాంటి రేబీస్‌ టీకాలు వేసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు. ఆపై బెంగళూరు పాలికెలో దరఖాస్తు చేసుకుంటే పరిహారం కూడా లభిస్తుంది. వీధి కుక్క కరిస్తే బీబీఎంపీ పరిహారం అందించే విషయం చాలామందికి తెలియదు. దీంతో గత ఏడేళ్లలో 32 వేలమందికి పైగా కుక్కకాట్లుకు గురైనప్పటికీ అక్షరాలా 25 మంది మాత్రమే పరిహారం తీసుకున్నారు.  

గాయాన్ని బట్టి పరిహారం  
►   హైకోర్టు ఆదేశాలతో గత 8 ఏళ్ల నుంచి వీధి కుక్కల బాధితులకు బీబీఎంపీ పరిహారం అందిస్తోంది  
►   పరిహారాన్ని ఎలా లెక్కిస్తారంటే ప్రతి గాయానికి రూ.2 వేలు, లోతైన గాయమైతే  రూ.3 వేలు, గాయాలు సంఖ్య ఎక్కువగా ఉంటే  రూ.10 వేలు పరిహారం లభిస్తుంది. అలాగే చికిత్స వ్యయాన్ని కూడా బీబీఎంపీ భరిస్తుంది.  
►    ఒకవేళ కుక్క కరిచి పిల్లలు చనిపోతే రూ.50 వేలు, పెద్దలు చనిపోతే లక్ష రూపాయలు సదరు కుటుంబానికి అందించాలి.  
►   2016 నుంచి ఏప్రిల్‌ 2022 వరకు బీబీఎంపీ పరిధిలో 32,161 మంది వీధి కుక్కల బారినపడ్డారు.  వీరిలో కేవలం 25 మంది దరఖాస్తు చేసుకుని పరిహారం పొందారు.  
25 మందికి.. రూ.15 లక్షలు  
►  2016–17లో ఒక వ్యక్తిపై వీధి కుక్కలు దాడి చేశాయి, పరిహారం, చికిత్స వ్యయంతో కలిపి రూ.70,430ను పాలికె అందజేసింది.  
► 2017–18 లో ముగ్గురికి కలిపి రూ.60,645 ఇచ్చింది. 2018–19లో విభూతిపురలో ప్రవీణ్‌ అనే బాలుడు వీధికుక్కల దాడిలో మృతిచెందాడు. ఆ కుటుంబానికి పరిహారం, ఆసుపత్రి వ్యయం తో కలిపి రూ.8,42,963 ముట్టజెప్పింది.  
►  2019–20  లో 9 మందికి రూ.2,07,292, 2020–21 లో 7 మందికి  రూ.2,22,540, 2021–22  లో నలుగురి కి రూ.85,431 పరిహారం ఇచ్చింది.  
►  ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం పరిహారం రూ.15 లక్షలకు చేరింది.  

చాలామందికి తెలియదు  
బీబీఎంపీ పరిహారం గురించి నగరవాసులకు తెలియదు. దీంతో కుక్క కొరికితే సొంత ఖర్చుతో చికిత్స తీసుకుని మరిచిపోతున్నారు. ఇటీవల పాలికె కమిషనర్‌ తుషార్‌ గిరినాథ్‌ మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. ఇంత ముఖ్యమైన సంగతిని పాలికె ప్రజలకు చేరవేయడం లేదు.

చదవండి: అదిరింది.. అంబానీ కాబోయే కోడలి అరంగేట్రం

మరిన్ని వార్తలు