Lockdown: వందలాది మంది ఒక్కచోట చేరి

24 May, 2021 14:00 IST|Sakshi

బెంగళూరు: లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ కర్ణాటకలో వందలాది మంది ఒక్కచోట చేరారు. స్థానిక ఆధ్యాత్మిక సంస్థకు చెందిన గుర్రం అంత్యక్రియల్లో పాల్గొనేందుకు తరలివచ్చారు. ఈ క్రమంలో చాలా మంది మాస్కులు ధరించలేదు. భౌతిక దూరం పాటించలేదు. బెలగావి జిలాల్లోని మెరడిమాత్‌ ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విధంగా లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

అదే విధంగా గ్రామాన్ని సీల్‌ చేసి, స్థానికులకు ఆర్టీ- పీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఊరు దాటి బయటకు వచ్చేందుకు అనుమతి లేదని, వారంతా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు హోం మంత్రి బసవరాజ్‌ బొమ్మై ఏఎన్‌ఐకి తెలిపారు. కాగా కరోనా సెకండ్‌వేవ్‌తో కర్ణాటక అల్లాడుతున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే అత్యధికంగా 626 కరోనా మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో మహమ్మారి కట్టడికై విధించిన లాక్‌డౌన్‌.. జూన్‌ 7 వరకు కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

చదవండి: Vaccination: తప్పించుకునేందుకు నదిలో దూకారు!

>
మరిన్ని వార్తలు