నేడు ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద కవిత దీక్ష

10 Mar, 2023 02:51 IST|Sakshi

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై నేడు జంతర్‌మంతర్‌ వేదికగా నిరాహార దీక్ష 

సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌లు కల్పించే మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలనే డిమాండ్‌తో శుక్రవారం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చేపట్టే నిరాహార దీక్షకు అంతా సిద్ధమైంది. జంతర్‌మంతర్‌ వేదికగా జరిగే ఈ దీక్షకు భారత జాగృతి నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఉదయం 10 గంటలకు దీక్ష ప్రారంభం కానుండగా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ దీక్షకు 18 రాజకీయ పా ర్ణీలు ఇప్పటికే సంఘీభావం ప్రకటించగా, వివిధ రాష్ట్రాల నుంచి మహిళా సంఘాల నేతలు, ప్రతినిధులు హాజరు కానున్నారు. 

మద్దతుపై కాంగ్రెస్‌తోనూ చర్చలు... 
మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చేపడుతున్న దీక్షకు సంఘీభవం తెలపాలని వివిధ రాజకీయ పా ర్ణీల నేతలను భారత జాగృతి నేతలు సంప్రదించారు. అందుకు బీఆర్‌ఎస్‌ సహా నేషనల్‌ కాన్ఫరెన్స్, పీడీపీ, అకాలీదళ్, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, సమాజ్‌ వాదీ, సీపీఐ, సీపీఎం, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, ఆప్, ఆర్‌ఎల్డీ, జేఎమ్‌ఎమ్‌ వంటి పా ర్ణీలు సమ్మతించాయి. కాగా ఈ దీక్షకు సంఘీభావంగా పార్టీ తరఫున ప్రతినిధులను పంపాలని కాంగ్రెస్‌ అగ్రనేతలను సైతం సంప్రదించామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

ఈ విషయమై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో మాట్లాడినట్లు వెల్లడించారు. అయితే కాంగ్రెస్‌ నుంచి ప్రతినిధుల హాజరుపై మాత్రం స్పష్టత రాలేదు. ఉదయం 10 గంటలకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షను ప్రారంభిస్తారు. ఈ మేరకు గురువారం సీతారాం ఏచూరిని కవిత కలిసి శుక్రవారం నాటి దీక్ష ప్రారంభ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వా నించారు.

ఇక దీక్ష ముగింపునకు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా తదితరులు పాల్గొనే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు. దీక్షలో సుమారు 5వేల మంది పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీక్ష కోసం వివిధ వర్శిటీల నుంచి యువకులు, మహిళలను పెద్ద ఎత్తున తరలించేలా నేతలు ఏర్పాట్లు చేశారు.  

చివరి నిమిషంలో బీజేపీ వేదిక మార్పు .. 
కాగా జంతర్‌మంతర్‌ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్షా స్థలి విషయంలో కొంత వివాదం తలెత్తింది. దీక్షలో 5వేల మంది పాల్గొనేందుకు వీలుగా తొలుత విశాలమైన దీక్షా స్థలిని కేటాయించిన ఢిల్లీ పోలీసులు గురువారం మధ్యాహ్నం దానిని కుదించినట్లు కవితకు సమాచారమిచ్చారు. దీక్షకు మొదటగా కేటాయించిన ప్రాంతాన్ని విభజించి టిబెట్‌ అంశంపై జరిగే ఆందోళన, ఆప్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ఆందోళనకు స్థలం కేటాయించారు.

ఈ నేపథ్యంలో కవిత ఢిల్లీ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో దీక్షాస్థలికి పక్కనే బీజేపీ ఆందోళనకు కేటాయించిన స్థలాన్ని ఢిల్లీ పోలీసులు మార్చారు. భారత జాగృతి దీక్ష, బీజేపీ ఆందోళన పక్క పక్కనే జరిగితే ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయనే ఉద్దేశ్యంతో బీజేపీ కార్యక్రమ వేదికను దీన్‌ దయాళ్‌ మార్గ్‌ ప్రాంతానికి మార్చారు.

మరిన్ని వార్తలు