Pondicherry: మేనత్త కూతురిని ఇష్టపడ్డాడు.. నో చెప్పడంతో అర్ధరాత్రి కీర్తనను..

21 Jul, 2022 08:11 IST|Sakshi

సాక్షి, చెన్నై: మేనత్త కూతురిపై మనస్సు పడ్డ ఓ యువకుడు  ప్రేమోన్మాదిగా మారాడు. తనతో మాట్లాడటం లేదనే ఆగ్రహంతో ఆ యువతిని నరికి చంపేశాడు. వివరాలు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని తిరుబువనం సన్యాసి కుప్పానికి చెందిన నాగరాజ్‌కు  ఇద్దరు భార్యలు. మొదటి భార్య మయిల్‌ మరణించడంతో అంబికను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదుగురు పిల్లలు, ఇందులో కీర్తన(19) మూడో కుమార్తె. ఈమె డిగ్రీ చదువుతోంది. 

కీర్తనపై మయిల్‌ అన్న కుమారుడు ముఖేష్‌ మనస్సు పడ్డాడు. అయితే ముఖేష్‌కు మద్యం అలవాటు ఉండడంతో అతడి ప్రేమను కీర్తన తిరస్కరిస్తూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో మంగళవారం రాత్రి కళాశాల నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో నిర్మానుష్య ప్రదేశంలో కీర్తనను ముఖేష్‌ అడ్డుకున్నాడు. ప్రేమించాలని, పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెచ్చాడు. ఆమె నిరాకరించడంతో  ఉన్మాదిగా మారాడు. వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె తల వెంట్రుకల్ని కత్తరించేశాడు. తర్వాత ఉడాయించాడు. 

ఆమెను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించి.. సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె శరీరంపై 18 చోట్ల కత్తిగాట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసులు మృత దేహాన్ని మార్చురీకి తరలించారు. అనంతరం, పరారీలో  ఉన్న ముఖేష్‌ కోసం గాలిస్తున్నారు. కాగా బుధవారం ఉదయం సంఘటనా స్థలాన్ని ఎస్పీ జిత్తన్‌ కోదండరామన్‌ నేతృత్వంలోని ప్రత్యేక బృందం పరిశీలించింది.

ఇది కూడా చదవండి: ఆయన నా భర్తే.. రచ్చకెక్కిన నవ్య శ్రీ ఉదంతం.. ఫొటోలు వైరల్‌ 

మరిన్ని వార్తలు