యూట్యూబ్‌లో చూసి వైన్‌ తయారీ.. స్నేహితుడికి తాగించడంతో..

30 Jul, 2022 18:55 IST|Sakshi

తిరువనంతపురం: మనకంటూ ఓ మొబైల్‌, అందులో ఇంటర్నెట్‌ ఉంటే చాలు.. ప్రపంచమంతా మన చేతిలో ఉన్నట్లే. ఏది కావాలన్న, ఏం తెలుసుకోవాలన్న క్షణంలో గూగుల్‌, యూట్యూబ్‌లో వెతికేస్తున్నారు. సాధారణంగా యూట్యూబ్‌ ద్వారా చాలామంది వంటలు, అల్లికలు వంటి వాటిని నేర్చుకుంటుంటారు. తాజాగా ఓ మైనర్‌ బాలుడు యూట్యూబ్‌లో చూసి మ‌ద్యం ఎలా త‌యారు చేయాలో నేర్చుకున్నాడు. నేర్చుకున్నట్లే ద్రాక్ష పండ్లతో మద్యాన్ని కూడా తయారు చేశాడు. అయితే అక్కడే అతనికి దెబ్బకొట్టింది. అసలేం జరిగిందంటే

కేరళలోని తిరువనంతపురం చిరాయింకీజుకు చెందిన 12 ఏళ్ల బాలుడు యూట్యూబ్​లో వీడియోలు చూసి ద్రాక్ష పండ్లతో మద్యాన్ని తయారుచేశాడు. అంతేగాక ఈ వైన్​ను రుచి చూడాలని చెప్పి తన స్నేహితులకు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకేముంది తాగిన కాసేపటికి స్నేహితుల్లోని ఓ యువకుడు అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు చేసుకొని ఆస్పత్రిలో చేరాడు. కల్తీ మద్యం తాగిన బాలుడిని వెంటనే చిరాయింకీజులోని ఆసుపత్రికి తరలించారు  ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటన తిరువనంతపురంలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసినట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. పోలీసుల విచారణలో తన తల్లిదండ్రులు కొనుగోలు చేసిన ద్రాక్ష పండ్లతోనే మద్యం తయారు చేశానని బాలుడు చెప్పాడు. అందులో ఎలాంటి రసాయనాలు కలపలేదని తెలిపాడు. యూట్యూబ్​లో చూపించిన విధంగా వైన్ తయారు చేసి దానిని ఒక సీసాలో నింపి.. కొన్ని గంటలు భూమిలో పాతిపెట్టినట్లు వివరించారు. ఆ తర్వాత స్నేహితుడికి ఇచ్చినట్లు చెప్పాడు.

కాగా బాలుడు తయారు తయారు చేసిన వైన్ బాటిల్​ను పోలీసులు స్థానిక కోర్టు అనుమతితో పరీక్షల నిమిత్తం ల్యాబ్​కు పంపించారు. అయితే వైన్​లో మరేదైనా ఆల్కహాల్ కలిపినట్లు, ఇంకేదైనా రసాయనాలు కలిపినట్లు తేలితే బాలుడిపై జువెనల్‌ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు