అరుదైన రికార్డు సృష్టించిన పదేళ్ల చిన్నారి

12 Oct, 2020 15:01 IST|Sakshi

తిరువనంతపురం: పదేళ్ల పిల్లలకు సరిగ్గా తినడమే రాదు.. ఇక వంట సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు అంత చిన్న పిల్లల్ని కిచెన్‌లోకి రానివ్వరు. ఒకవేళ వెళ్లినా మహా అయితే టీ, మ్యాగీ లాంటివి చేస్తారు తప్ప పెద్ద వంటకాంలే వండలేరు. కానీ కేరళకు చెందిన ఈ చిన్నారి మాత్రం అలా కాదు. దేశీయ వంటలతో పాటు విదేశీ వంటలను వండగలదు. మరో ప్రత్యేకత ఏంటంటే గంట వ్యవధిలో 30 రకాల వంటలు వండి రికార్డుల్లోకి ఎక్కింది. ఆ వివరాలు.. వింగ్ కమాండర్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రాజిత్ బాబు కూతురు శాన్వి ఎం ప్రాజిత్ గంటలో 30 కంటే ఎక్కువ వంటలు రెడీ చేయగలదు. ఊతప్ప, ఫ్రైడ్ రైస్, చికెన్ రోస్ట్ లాంటి వంటలన్నీ ఒకే చోట గంట సమయంలోనే తయారుచేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లలో స్థానం దక్కించుకుంది. పిల్లల పేరుతో ఇలా ఓ రికార్డు నమోదవ్వడం ఇదే తొలిసారి. (చదవండి: వైరలవుతున్న కేరళ బామ్మ ఆవేదన)

ఈ ఏడాది ఆగస్టు 29న 10సంవత్సరాల 6నెలల 12రోజుల వయస్సున్న శాన్వి ‘విశాఖపట్నంలోని తన ఇంట్లో వంట చేస్తుండగా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అథారిటీ దీనిని ఆన్ లైన్‌లో పర్యవేక్షించింది. సాక్ష్యంగా ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్లు ఆమె పక్కనే ఉన్నారు. గంటలో శాన్వి 30 ఐటెంలు రెడీ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా శాన్వి మాట్లాడుతూ.. ‘మా అమ్మ సాయంతోనే ఇది సాధించగలిగాను. స్టార్‌ చెఫ్‌ అయిన మా అమ్మ ఓ కుకరీ షోలో ఫైనల్‌ కంటెస్టెంట్‌గా నిలిచింది. ఆ స్ఫూర్తితోనే ఇది సాధించగలిగాను’ అని తెలిపింది.శాన్వి చిల్డ్రన్ కుక్కరీ షోలలో కూడా చాలా సార్లు పాల్గొంది. ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా నిర్వహిస్తూ.. రుచికరమైన వంటల రెసిపీలను ఫాలోవర్లతో పంచుకుంటుంది.

మరిన్ని వార్తలు