కొచ్చి : నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంలా నిలిచింది కేరళకు చెందిన ఓ లాటరీ వ్యాపారి. రూ. 6 కోట్ల లాటరీ టికెట్ను విజేతకు అందించి అందరి మన్ననలు పొందుతోంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొచ్చికి చెందిన 37 ఏళ్ల స్మిజ లాటరీ టికెట్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. గత ఆదివారం ఆమె దగ్గర అమ్ముడుపోని 12 బంపర్ లాటరీ టికెట్లు ఉన్నాయి. తరుచూ టికెట్లు కొనేవాళ్లు కూడా ఎవరూ షాపు దగ్గరకు రాలేదు. దీంతో ఆమె చంద్రన్ అనే వ్యక్తికి ఫోన్ చేసింది. అతడు ఆ టికెట్లు అన్నీ తానే కొన్నాడు. ఆ రోజు సాయంత్రమే లాటరీ గెలుచుకున్న టికెట్కు సంబంధించిన వివరాలు ప్రకటించబడ్డాయి. చంద్రన్ కొనుక్కున్న టికెట్లలో ఓ దానికి రూ. 6 కోట్ల రూపాయల లాటరీ తగిలింది. ఆమె వెంటనే చంద్రన్ ఇంటికి చేరుకుని టికెట్ను అతడికి అందించింది. దీంతో జనం ఆమెను ప్రశంసలతో ముంచెత్తటం మొదలుపెట్టారు.
దీనిపై స్మిజ మాట్లాడుతూ.. ‘‘ చంద్రన్కు రూ. 6 కోట్ల టికెట్ను ఇచ్చిన తర్వాత అతడు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. నా నిజాయితీని మెచ్చుకుంటూ అందరూ ఫోన్లు చేస్తున్నారు. ఈ వ్యాపారంలో ఇలాంటి వన్నీ మామూలే. టికెట్ కొనటానికి డబ్బులకోసం కష్టపడే కస్టమర్ల ద్వారానే మా పూట గడుస్తోంది కాబట్టి మేము నిజాయితీగా ఉండక తప్పదు. నేను, నా భర్త కాక్కనాడ్లోని గవర్నమెంట్ ప్రెస్లో పనిచేసేవాళ్లం. 2011లో ఈ వ్యాపారం మొదలుపెట్టాము. మొత్తం 5 గురు ఉద్యోగులు ఉండేవారు. మా ఉద్యోగాలు పోయిన తర్వాత మేమిద్దరమే వ్యాపారం చూసుకుంటున్నాము’’ అని తెలిపింది.
చదవండి.. చదివించండి : 2 నెలల కొడుకు కోసం చంద్రుడిపై స్థలం..