ప్లీజ్‌ నన్ను చంపకండిరా అయ్యా.. 25కోట్ల లాటరీ డబ్బులు నాకు వద్దు!

25 Sep, 2022 12:11 IST|Sakshi

అదృష్టం ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో తెలియదు. ఒక్కరోజులో సామాన్యుడు ధనవంతుడు కావచ్చు.. కోటీశ్వరుడు సామాన్యుడు కావొచ్చు. కాగా, ఇటీవలే కేరళకు చెందిన ఆటో డ్రైవర్‌ అనూప్‌.. లాటరీలో రూ. 25 కోట్ల బహుమతి గెలుచుకొని రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఈ క్రమంలో ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. కానీ, ఐదు రోజులు గడిచిన తర్వాత అనూహ్యంగా తనకు బహుమతి వద్దనిపిస్తుందని అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు.

అయితే, కేరళ ప్రముఖ పండగ ఓనం సందర్భంగా ప్రభుత్వం నిర్వ‌హించిన మెగా ఓనం రాఫిల్‌లో ఆటోడ్రైవర్‌ అనూప్‌ రూ. 25 కోట్ల లాటరీ బహుమతిని గెలుచుకున్నాడు. దీంతో, అనూప్‌.. ఆనందం వ్యక్తం చేశాడు. కానీ, ఇంతలోనే ఆ డబ్బు వస్తున్న కారణంగా తాను మనోవేదనకు గురవుతున్నట్టు తెలిపాడు. తాజాగా అనూప్‌ మాట్లాడుతూ.. లాటరీ డబ్బులో ప‌న్ను, ఇతర బకాయిలు పోయిన తర్వాత ప్రైజ్ మనీగా రూ. 15 కోట్లు వచ్చే అవకాశం ఉంది. లాటరీ గెలిచాక 2 రోజులుగా ఆనందంగా గడిపాను. కానీ, ప్రస్తుతం మాత్రం మనశ్శాంతిని కోల్పోయాను.. నిద్ర కూడా పట్టడంలేదని అన్నాడు.

ఎందుకంటే, నేను లాటరీ గెలిచాక నా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తమ అసరాలను తీర్చమంటూ కాల్స్‌ చేసి ఇబ్బంది పెడుతున్నారు. దీంతో, ఇంట్లో నివసించే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగానే నా అవసరాలు తీరే విధంగా తక్కువ మొత్తంలో డబ్బులు వచ్చినా బాగుండేది. అలాగైనా ప్రశాంతంగా ఉండేవాడినని అంటున్నాడు. ఎందుకంటే డబ్భులు వచ్చాయని తెలియగానే తనకు తెలిసిన వారు చాలా మంది శత్రువులుగా మారుతున్నారని వాపోయాడు. అయితే, తనకు ఇంకా డబ్బులు అందలేదని సోషల్ మీడియా ద్వారా అందరికీ చెబుతున్నానని అన్నాడు. కాగా, ఒక్కసారిగా అంత మొత్తంలో డబ్బు వస్తున్నందు వల్ల ఆ డబ్బును ఏం చేయాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నాడు. వచ్చిన మొత్తం డబ్బును కొద్దిరోజులు బ్యాంకులోనే ఉంచుతానని స్పష్టం చేశాడు. 

మరిన్ని వార్తలు