కరోనా కట్టడికి రెండు రోజులపాటు భారీ ఎత్తున పరీక్షలు

21 Jul, 2021 21:25 IST|Sakshi
ఫైల్‌ ఫొటో

తిరువనంతపురం: మహమ్మారి కరోనా వైరస్‌ విజృంభణ మళ్లీ తీవ్రమవుతోంది. ఇప్పటికే దేశంలో కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేరళలో కూడా ఆ వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కరోనా కట్టడికి మళ్లీ లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. రెండు రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో క్రమేణ కేసులు పెరుగుతుండడంతో భారీ ఎత్తున పరీక్షలు నిర్వహించనుంది.

బక్రీద్‌ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు ఆంక్షలను ఎత్తివేసింది. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. సుప్రీంకోర్టు ఈ అంశంపై విచారణ కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు కేసులు పెరుగుతుండడంతో ఈనెల 25-26వ తేదీల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. ఆ రెండు రోజుల్లో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహించనుంది. మూడు లక్షల కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం వైద్యారోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలోనే ఆ రెండు రోజులు తీవ్ర ఆంక్షలపై నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిపై సీఎం పినరయి విజయన్‌ పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం పదివేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం ఒక్కరోజే 17,481 కేసులు నిర్ధారణ అయ్యాయి. 105 కరోనా మరణాలు సంభవించాయి. ఆ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 11.97 శాతంగా ఉంది. 1,29,640 పాజిటివ్‌ కేసులు ఉండడం చూస్తుంటే ఆ రాష్ట్రంలో ఇంకా కరోనా విజృం‍భణ అదుపులోకి రానట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు